చింత చచ్చినా పులుపు చావలేదంటారు. అలాగే ఉంది కన్నడ హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర తీరు. మర్డర్ కేసులో అరెస్టై.. జైల్లో చిప్పకూడు తింటున్నా వాళ్లల్లో కించిన్ పశ్చాత్తాపం కనిపించడం లేదంటున్నారు జనం. పోలీస్ ఇంటరాగేషన్లో ఫుల్ మేకప్తో పవిత్ర కనిపించడం కలకలం రేపింది. ఇక, దర్శన్కు సంబంధించి కూడా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
కన్నడ చిత్ర పరిశ్రమలో మాయని మచ్చగా మిగిలిపోయిన రేణుకా స్వామి మర్డర్ కేసులో తవ్వే కొద్దీ సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. నటుడు దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ కలిసి చేసిన ఈ దారుణ హత్యలో రోజుకో నిజం వెలుగులోకి వస్తోంది. లేటెస్ట్గా రేణుకా స్వామి మర్డర్ వెనుక లక్షల రూపాయల డీల్ బయటపడింది. దర్శన్ గ్యాంగ్ నుంచి 70లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాంతో, ఈ కేసుపై ఐటీ డిపార్ట్మెంట్ కూడా నజర్ పెట్టింది. అసలు, ఎంత డబ్బు చేతులు మారింది? ఎక్కడ్నుంచి ఆ డబ్బు వచ్చింది? ఎవరు ఇచ్చారు..? ఇలా అనేక కోణాల్లో ఆరా తీస్తున్నారు. పోలీసులు రాసిన లేఖతో డబ్బు మూలాలు కనిపెట్టేందుకు రెడీ అవుతున్నారు ఇన్కం ట్యాక్స్ అధికారులు.
–
ఇక, దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ తీరు మరోసారి వివాదాస్పదమైంది. మర్డర్ కేసులో అరెస్టై, జైల్లో చిప్ప కూడు తింటున్నా సోకుల విషయంలో అస్సలు తగ్గడం లేదు. జైల్లోనూ, పోలీస్ కస్టడీలోనూ మేకప్ కిట్స్, కాస్మోటిక్స్ వాడినట్టు గుర్తించారు పోలీసులు. కస్టోడియల్ ఇంటరాగేషన్ టైమ్లో పవిత్రగౌడ మేకప్ వేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతేకాదు, పోలీస్ వాహనంలోనే లిప్స్టిక్ వేసుకుంటున్న దృశ్యాలు కూడా బయటికి వచ్చాయి. దాంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహిళా ఎస్సైకి నోటీసులిచ్చారు ఉన్నతాధికారులు.
మరోవైపు, రేణుకాస్వామి మెసేజ్లను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో రేణుకా స్వామి చాటింగే కీలక కావడంతో ఇన్ఫర్మేషన్ను రిట్రీవ్ చేయాలంటూ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్కి లేఖ రాశారు. రేణుకా స్వామి మొబైల్ను నిందితులు ధ్వంసం చేయడంతో.. అతడు వాడిన మొబైల్ నెంబర్ డూప్లికేట్ సిమ్ ద్వారా డేటా రిట్రీవ్కు ట్రై చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఐడీ నుంచే పవిత్రగౌడకు మెసేజ్లు పంపాడు రేణుకాస్వామి. దాంతో, ఆ చాట్ మొత్తాన్ని తిరిగి సంపాదించేందుకు ప్రయత్నిస్తు్న్నారు పోలీసులు.
రేణుకాస్వామి మర్డర్ కేసులో ఇప్పటివరకు 17మంది అరెస్ట్ అయ్యారు. వీళ్లల్లో నలుగురు నిందితుల్ని అగ్రహార కేంద్ర కారాగారం నుంచి తుమకూరు జైలుకు తరలించారు. ఏ8 రవిశంకర్, ఏ15 కార్తీక్, ఏ16 కేశవమూర్తి, ఏ17 నిఖిల్ నాయక్ల ప్రాణాలకు ముప్పు ఉందన్న పిటిషన్ మేరకు ఈ నలుగురిని తమకూరుకు షిఫ్ట్ చేశారు. ఇక, ఈ కేసులో ఇప్పటివరకు 8మంది ప్రత్యక్ష సాక్షులను విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. త్వరలోనే ఛార్జిషీట్ కూడా వేయడానికి రెడీ అవుతున్నారు పోలీసులు. మరి, ఛార్జిషీట్లో ఎలాంటి సంచలనాలు బయటికి వస్తాయో చూడాలి!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..