కొంతమంది సైకో బ్యాచ్ సోషల్మీడియాలో బరితెగించి రాతలు రాస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా అందరూ వీరి బాధితులే. ముఖ్యంగా మహిళలు వీరి భారిన పడుతున్నారు. తమ తప్పు లేకపోయినా వాళ్లు నిందలు భరించాల్సి వస్తుంది. వీరి ద్వేషాన్ని, చేస్తున్న ట్రోల్స్ని భరించలేక రేణూ దేశాయ్ తన ట్విటర్, ఫేస్బుక్ డిలీట్ చేశానని ప్రకటించారు.
విడాకుల అనంతరం నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు దూరంగా ఉంటూనే.. ఒంటరి తల్లిగా తన ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు రేణూ దేశాయ్. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ పోస్టులు, ఫొటోలు, వీడియోల రూపంలో తన ఫ్యాన్స్తో పంచుకుంటారు. అయితే ఇటీవల సోషల్మీడియాలో ఎదురైన రెండు ఘటనలు..ఆమెను తీవ్రంగా ఆవేదన పరిచాయి
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవలే తన ప్రమాణ స్వీకారం ముగిశాక.. తన సతీమణి అనా లెజినొవా, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి సరదాగా ఓ ఫొటో దిగారు. దాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలైంది. దీనికి ‘క్యూట్ ఫొటో’ అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరికొందరు నెగెటివ్గా స్పందించారు. ఆ ఫొటోను ఉపయోగించి రేణూ దేశాయ్ను అవమానపరిచేలా కొందరు మీమ్స్ రూపొందించారు. దీంతో వారిపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యక్తులు సమాజానికే అత్యంత భయంకరమంటూ.. ఇన్స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తనపై మీమ్స్, జోక్స్ పేల్చే వ్యక్తులకు కూడా కుటుంబం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తనను ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును ఇన్స్టాలో చూసి తన కుమార్తె విపరీతంగా ఏడ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు రేణూ దేశాయ్. తన కుమార్తె కన్నీళ్లు.. కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకోవాలని ట్రోలర్స్ను హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణం చేసినప్పుడు కూడా రేణూదేశాయ్ని విమర్శిస్తూ కొందరు పోస్టులు పెట్టారు. పవన్ కల్యాణ్ నుంచి విడిపోవడం తన దురదృష్టమంటూ కామెంట్లు చేశారు. దీనికీ తనదైన రీతిలో స్పందిస్తూ.. నెటిజన్ల నోళ్లు మూయించింది రేణు. అవే స్క్రీన్షాట్లను ఇన్స్టాలో పంచుకుంటూ..తాను దురదృష్టవంతురాలిని అంటూ ఓ వ్యక్తి వ్యంగ్యంగా పోస్టు పెట్టాడని..అసలు తాను ఎలా దురదృష్టవంతురాలినో చెప్పాలన్నారు. తన అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు. విడాకులు తీసుకున్నంత మాత్రాన స్త్రీ, పురుషులు దురదృష్టవంతులు కాదన్న విషయం సమాజం తెలుసుకుంటే చాలన్నారు రేణూ దేశాయ్.
తనపై చూపిస్తున్న ద్వేషాన్ని, చేస్తున్న ట్రోల్స్ని చూడలేక ట్విటర్, ఫేస్బుక్ డిలీట్ చేశానన్నారు..రేణూ దేశాయ్. కానీ ఆపదలో ఉన్న చిన్నారులకు ఆహారం, మెడిసిన్స్ అందించడానికి ఇన్స్టాగ్రామ్ను ఉపయోగిస్తానని అందువల్ల ఆ అకౌంట్ను మాత్రం డిలీట్ చేయలేనని చెప్పారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.