ముందు నుయ్యి వెనక గొయ్యి.. టాలీవుడ్లో కొందరు దర్శకులకు ఈ మాటే సరిపోతుందిప్పుడు. ముందు సినిమా ఫ్లాప్ కావడంతో.. ప్రస్తుతం చేస్తున్న సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయారు వాళ్లు. పైగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ మరింత ప్రెజర్లో ఉన్నారు. ఆ సినిమాలే వాళ్ళ కెరీర్ డిసైడర్స్ అయిపోయాయి. మరి అంత బరువు మోస్తున్న దర్శకులెవరో చూద్దాం..
దర్శకులకు టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఒక్క ఫ్లాప్తోనే కెరీర్ అంతా తారుమారైపోతుంది. కావాలంటే కొరటాల శివను చూడండి.. ఆచార్య ముందు వరకు ఆయనకు తిరుగు లేదు. రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేని దర్శకుడాయన. కానీ ఆచార్యతో ఫేట్ మారిపోయింది.. సీన్ రివర్స్ అయిపోయింది. దాంతో కొరటాల ఆశలన్నీ దేవరపైనే ఉన్నాయిప్పుడు.
కొరటాల కెరీర్కు డిసైడర్గా మారిపోయింది దేవర. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మరోవైపు క్రిష్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒక్కో సినిమాను ఆర్నెళ్లలో పూర్తి చేసే క్రిష్.. హరిహర వీరమల్లు కోసం మూడేళ్ల నుంచి కష్టపడుతున్నారు. మరోవైపు పూరీ జగన్నాథ్ సైతం లైగర్ ఫ్లాప్ తర్వాత డబుల్ ఇస్మార్ట్తో దేశాన్ని దున్నేయాలని చూస్తున్నారు.
పవన్నే నమ్ముకున్న మరో దర్శకుడు సుజీత్. సాహోతో తెలుగు ఆడియన్స్ను మెప్పించలేకపోయిన ఈ దర్శకుడు.. ఓజితో పాన్ ఇండియన్ దండయాత్ర చేయనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తైంది. సుజీత్ కెరీర్కు అత్యంత కీలకంగా మారింది ఓజి. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పైగా రెండు భాగాలుగా రాబోతుంది ఓజి.
శంకర్ కెరీర్కు కీలకంగా మారింది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. ఐ, 2.0 అనుకున్నంత ఆడకపోవడం.. ఇండియన్ 2 కష్టాలు.. ఇవన్నీ చరణ్ సినిమాను శంకర్ కెరీర్కు ఊపిరిగా మార్చేసాయి. గేమ్ ఛేంజర్ ఆడితే శంకర్ కెరీర్కు తిరుగుండదు. ఇక ఇప్పటి వరకు చిన్న సినిమాలే చేసిన మారుతికి.. ప్రభాస్ సినిమా కీలకంగా మారింది. పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా వస్తుందీ సినిమా. వీటితో ఆయా దర్శకులు ఏం మాయ చేస్తారో చూడాలి..?