ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో పర్యటించారు. పవన్‏కు స్థానికులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి పరిస్థితుల గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడలోని మత్స్యకార కుటుంబాల సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలపై స్పందించాలని అభిమానులు కోరగా కీలక కామెంట్స్ చేశారు. సినిమాల్లో నటించడంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇక పై మూడు నెలలపాటు సినిమా చిత్రీకరణలకు దూరంగా ఉంటానని అన్నారు. వీలున్పప్పుడు ఒకట్రెండు రోజులు షూటింగ్‏కు కేటాయిస్తానని అన్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ.. క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాలు చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఇటు రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్స్ తాత్కలికంగా బ్రేక్ పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ మూవీస్ నుంచి పవన్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు మేకర్స్. ఈచిత్రాల గురించి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకంటే ముందు నుంచి పవన్ సినిమా చిత్రీకరణలకు బ్రేక్ ఇచ్చాడు. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. సినిమాల్లో నటిస్తానని పవన్ చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.