వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శర్వానంద్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల మనమే సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో శర్వానంద్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ టాక్ అందుకుంది. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. రోటిన్ స్టోరీ అయినా.. డైరెక్షన్, శర్వానంద్, కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. భారీగా కలెక్షన్స్ వసూలు చేయకపోయినా నిర్మాతలకు మాత్రం లాభాలను తెచ్చిపెట్టింది ఈ మూవీ. థియేటర్లలో పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

తాజా సమాచారం ప్రకారం శర్వానంద్, కృతి కలిసి నటించిన మనమే సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో రాహుల రవీంద్రన్, శివ కందుకూరి కీలకపాత్రలు పోషించగా.. ఖుషి మూవీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో మొత్తం పదహారు పాటలు ఉన్నాయి.

కథ విషయానికి వస్తే..
విక్రమ్ (శర్వానంద్) ప్రాణ స్నేహితుడు, అతడి భార్య ఓ ప్రమాదంలో కన్నుమూస్తారు. వాళ్ల కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) సంరక్షణ బాధ్యత విక్రమ్ తోపాటు సుభద్ర (కృతి శెట్టి)పై పడుతుంది. దీంతో ఖుషి కోసం పెళ్లి కాకుండా తల్లిదండ్రులుగా మారతాయి. వారిద్దరి జీవితంలోకి ఖుషి వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? జోసెఫ్ (రాహుల్ రవీంద్రన్), కార్తీక్ (శివ కందుకూరి) ఎవరు ? అనేది తెలియాలంటే మనమే సినిమా చూడాల్సిందే. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన మనమే మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.