తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అతుల్య రవి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. 2017లో కాదల్ ఖాన్ కటుటే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏమాలి, నాదోడిది 2 వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్న అతుల్య రవికి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. మీటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ అందుకోలేదు. ప్రస్తుతం అతుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి కోయంబత్తూరులోని వాడవల్లి మారుతం రోడ్డులో నివసిస్తుంది. తాజాగా ఈ హీరోయి ఇంట్లో చోరీ జరిగినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం హీరోయిన్ పాస్ పోర్టుతోపాటు రూ.2000 దొంగిలించినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఇంట్లో తన పాస్ పోర్టుతోపాటు డబ్బులు కూడా కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు.

అతుల్య రవి తల్లి విజయలక్ష్మి వాడవల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఇంట్లో పనిచేసే పనిమనిషి చోరికి పాల్పడినట్లు తెలిసింది. తొండముత్తూరు పక్కనే ఉన్న కులత్తుపాలేనికి చెందిన మహిళ(46) కొన్నాళ్లుగా అతుల్య రవి ఇంట్లో పనిచేస్తున్నారు. ఇంట్లో చోరీ జరిగినట్లు అతుల్య రవి తల్లి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు స్టార్ట్ చేసిన పోలీసులు పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సదరు మహిళను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.

తన స్నేహితురాలు సెల్వి, సుభాషిణితో కలిసి హీరోయిన్ ఇంట్లో దొంగతనం చేశామని.. డబ్బు, పాస్ పోర్టు దొంగించినట్లు తెలిపారు. పనిమనిషితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.1500 స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పాస్ పోర్టు ఎక్కడ దాచిపెట్టారు అనే విషయాలు తెలియరాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.