సినిమా ఇండస్ట్రీలో డాక్టర్ అవుదామని యాక్టర్ గా స్థిర పడిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అందులో న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి ఒకరు. తన అందం, అభినయంతో పాటు వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె మెడిసిన్ చదివింది. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. హీరోయిన్  గా రిటైరయ్యాక డాక్టర్ గా స్థిర పడతానంటూ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేసుకుందామె . గతంలో ఆమె సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా సొంతూరులో క్లినిక్ స్టార్ట్ చేసిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవేవీ నిజం కాలేదు. మళ్లీ హీరోయిన్ గా బిజీ అయిపోయిందీ అందాల తార. ప్రస్తుతం బాలీవుడ్ లో రామయాణం ఆధారంగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీలో సీతగా నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ మూవీ నుంచి రిలీజైన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. ముఖ్యంగా సీతమ్మ గెటప్ లో సాయి పల్లవి లుక్ సూపర్బ్ గా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే సాయి పల్లవికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటంటే.. తాజాగా జార్జియాలోని తాను మెడిసిన్ చదువుకున్న టీబీలీసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ డేకు సాయిపల్లవి హాజరైంది. తనతో పాటు చదువుకున్న స్నేహితులను, అధ్యాపకులను ఆమె పలకరించింది.

ఈ సందర్భంగా వేదికపై డాక్టర్ పట్టాను అందుకున్న సాయి పల్లవి ఫొటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘సాయి పల్లవి ఇకపై డాక్టర్ సాయి పల్లవి’ అంటూ అభిమానులు, నెటిజన్లు క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య సరసన తండేల్ అనే సినిమాలో నటిస్తోంది సాయి పల్లవి. చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయ్యింది. ఈ ఏడాది డిసెంబర్ 20న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇందులో సత్య పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి. దీంతో పాటు రామాయణ్ మూవీలోనూ నటిస్తోంది. ఇందులో రాముడిగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

డాక్టర్ పట్టా అందుకుంటోన్న సాయి పల్లవి.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.