కల్కి 2898 ఏడీ చిత్రంతో మరోసారి తన రేంజ్‌ ఏంటో ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకి చూపించారు ప్రభాస్‌. టాలీవుడ్‌ మొదలు బాలీవుడ్‌ వరకు ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 900 కోట్లు దాటేసి రూ. వెయ్యి కోట్ల దిశగా శర వేగంగా దూసుకుపోతోంది. బుక్‌ మై షోలో కోటి టికెట్స్‌ బుక్ కావడం, ఓవర్‌సీస్‌లో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన తొలి సౌత్ ఇండియన్‌ మూవీగా రికార్డు సృష్టించడం ఇలా చెప్పుకుంటూ పోతే కల్కి పాత రికార్డులన్నింటినీ చెరిపేస్తూ పోతోంది.

ఇక కల్కి చిత్రంతో ప్రభాస్‌ రేంజ్‌ కాస్త బాలీవుడ్‌ను దాటేసి హాలీవుడ్‌ స్థాయికి చేరుకుంటోంది. దీంతో తన తదుపరి చిత్రాలు అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే దర్శకుడు సందీప్ వంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ మూవీస్‌తో తన సత్తా ఏంటో చాటిన సందీప్‌ వంగా.. ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ పేరుతో ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్‌ కూడా ప్రారంభం కానీ ఈ సినిమాపై ఇప్పుడే భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్ని సందీప్ పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్పిరిట్‌ మూవీలో హాలీవుడ్ విలన్‌ను తీసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది. సౌత్‌ కొరియాకు చెందిన లీ డాండ్‌ సిక్‌ని విలన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ట్రైన్‌ టూ బూసాన్‌, మార్వెల్‌ సిరీస్‌ ఎటర్నల్‌ సినిమాల ద్వారా ఈ సౌత్‌ కొరియన్‌ యాక్టర్‌ ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా కథ అంతర్జాతీయ నేపథ్యంలో ఉంటుందని. అందుకే హాలీవుడ్‌ నటులపై దృష్టిసారించారని టాక్‌.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని సందీప్‌ ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని టి.సిరీస్‌, భద్రకాళి ప్రొడక్షన్స్‌ కలిసి నిర్మించనున్నారు. ప్రభాస్‌ ఇందులో పవన్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నారని ఇప్పటికే సందీప్‌ ప్రకటించారు. అయితే ఇందులో డార్లింగ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది చివరి నాటికి పట్టాలెక్కించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..