అందాల రాక్షసి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు నవీన్ చంద్ర. ఆ తర్వాత సినిమాల ఎంపికలో పొరపాట్లతో హీరోగా సక్సెస్ కాలేకపోయారు. ప్రధాన నటుడిగా చిన్న చిన్న సినిమాల్లో నటించిన నవీన్ చంద్ర.. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాతో విలన్ పాత్రలో కనిపించాడు. ఈ మూవీలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ప్రతినాయకుడిగా, సహయ నటుడిగా పలు చిత్రాల్లో నటిస్తున్న నవీన్ చంద్ర.. తాజాగా సారంగదరియా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‏కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మూవీ ప్రతీ ఇంట్లో జరిగే కథలా అనిపించిందని.. దర్శకుడు మంచి మెసెజ్ ఇచ్చేందుకు ఈ చిత్రం తీశారని అర్థం అవుతోందని అన్నారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. ఈ చిత్రానికి పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకత్వం వహించారు. సారంగదరియా సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు పద్మారావు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను జూలై 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే హీరో నిఖిల్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి హీరో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్‌ను కోనుగోలు చేశారు.

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘సారంగదరియా జూలై 12న రాబోతోంది. మంచి థియేటర్లు దొరికాయని చెబుతున్నారు. అందరూ థియేటర్‌కు వెళ్ళి సినిమాను చూడండి. రాజా రవీంద్ర గారు నాకు ఫ్యామిలీ వంటి వారు. చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ.. కొత్త నటీనటులకు సపోర్ట్ చేస్తూ, వారికి గైడెన్స్ ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ చిత్రంలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన ఉమాదేవి, శరత్ చంద్ర థాంక్స్. ప్రతీ ఇంట్లో జరిగే కథలా అనిపించింది. దర్శకుడు మంచి మెసెజ్ ఇచ్చేందుకు ఈ చిత్రం తెరకెక్కించారనే విషయం అర్థం అవుతోంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎబినైజర్ పాల్ సంగీతం నాకు చాలా నచ్చింది. ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్లోనే చూడండి. ఇలాంటి చిత్రానికి మీడియా సపోర్ట్ ఉండాలి’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.