ఉదయ్ కిరణ్.. ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లుతాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఓ సాధారణ కుర్రాడు హ్యాట్రిక్ హిట్స్ అందుకుని సెన్సెషన్ అయ్యాడు. కెరీర్ ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులు.. మానసిక ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో మనసంత నువ్వే ఒకటి. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకు వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించారు. 2001 అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఈ మూవీలో రీమా సేన్ కథానాయికగా నటించింది. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో దాదాపు 175 రోజుల వరకు విజయవంతంగా ఎన్నో కేంద్రాల్లో ఆడింది.

అలాగే ఉదయ్ కిరణ్‏కు స్టార్ డమ్ ఇచ్చిన సినిమా ఇదే. ఇక ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అంతగా ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. 2001లో ఎం.ఎస్ రాజు నిర్మాణంలో మహేష్ ఓ సినిమా చేయాలనుకున్నారు. అదే సమయంలో వి.ఎన్. ఆదిత్య తెరకెక్కించాలనుకున్న మనసంతా నువ్వే సినిమాను నిర్మాత ఎం.ఎస్ రాజు మహేష్ బాబుతో చేయాలనుకున్నారట. దీంతో మనసంత నువ్వే కథను ముందుగా మహేష్ కు వినిపించగా.. అప్పుడే కమర్షియల్ సినిమా చేయాలని వెయిట్ చేస్తున్న మహేష్.. ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారట.

దీంతో ఈ మూవీ ఆఫర్ ఉదయ్ కిరణ్ వద్దకు వెళ్లింది. అలా మహేష్ వదులుకున్న కథతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఉదయ్ కిరణ్. మనసంత నువ్వే సినిమా కుదరకపోవడంతో.. మహేష్ బాబు హీరోగా ఒక్కడు సినిమాను నిర్మించారు ఎం.ఎస్ రాజు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.