Published on: 7:53 am, 17 July 2024

తొందరపడకుండా నెమ్మదిగా సినిమాలు చేసినా రెగ్యులర్ పంథాకు దూరంగా ఖచ్చితంగా మెప్పించే సినిమాలే ఎంచుకుంటాడనే పేరున్న నవీన్ పోలిశెట్టి గత చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజై పది నెలలవుతోంది. సెప్టెంబర్ వస్తే యానివర్సరీ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా తన కొత్త మూవీ తాలూకు అనౌన్స్ మెంట్ రాలేదు. రెండేళ్ల క్రితం సితార బ్యానర్ అనగనగా ఒక రాజుని గతంలో ప్రకటించి కొంత భాగం షూట్ చేశాక ఆపేసిన సంగతి తెలిసిందే. దీన్నిటేకాఫ్ చేసిన కళ్యాణ్ శంకర్ ఆ తర్వాత ఇదే సంస్థలో మ్యాడ్ తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి నవీన్ ప్రాజెక్టు పెండింగ్ లో ఉండిపోయింది.

కొన్ని నెలల క్రితం అమెరికాలో చిన్న యాక్సిడెంట్ కు గురైన నవీన్ పోలిశెట్టి అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడు. యుఎస్ పౌరసత్వం ఉన్నప్పటికి షూటింగుల కోసం ఇండియా వచ్చి వెళ్తూ ఉండే ఈ యువ హీరో కథలు వినడం ఆపలేదట. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా పలువురు దర్శకులు సంప్రదింపులు జరిపినప్పటికీ ఏదీ కొలిక్కి రాలేదని సమాచారం. చిచోరేతో బాలీవుడ్ గుర్తింపు ఇచ్చిన దర్శకుడు నితేష్ తివారి భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న రన్బీర్ కపూర్ రామాయణంలో లక్ష్మణుడి పాత్ర ఆఫర్ చేశారనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో ఇంకా నిర్ధారణగా తెలియదు.

సరే కారణాలు ఏమైనా నవీన్ పోలిశెట్టి లాంటి టాలెంటెడ్ హీరోలు ఎక్కువ గ్యాప్ తీసుకోవడం సరికాదనేది నిజం. ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు కొత్తది మొదలుపెట్టి పూర్తి చేయడానికి ఎంత లేదన్నా ఇంకో ఆరేడు నెలలు పడుతుంది. అంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి దీనికి రెండేళ్ల తేడా రావొచ్చు. ప్రస్తుతానికి మీడియాకు కూడా అందుబాటులో లేని నవీన్ పోలిశెట్టి గతంలో ఆపేసిన సితారకు వేరే దర్శకుడి కాంబోతో సినిమా చేస్తాడా లేదానేది వేచి చూడాలి. ఇదే సినిమా కోసం హీరోయిన్ గా అప్పట్లో శ్రీలీలనే తీసుకున్నారు. ఆ డేట్లే గుంటూరు కారంకు వాడారని టాక్.