Sri Krishna Astami: శ్రావణ మాసం మొదలైపోయింది…ఇక పండుగల సీజన్‌ మొదలైపోయినట్లే..వరలక్ష్మి వ్రతం, శ్రావణ పూర్ణిమ, కృష్ణాష్టమి..ఇలా వరుస పెట్టి పండుగలు అన్ని వచ్చేస్తాయి. ఈ పండుగలలో చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే శ్రీ కృష్ణాష్టమి ఒకటి. ఈ పర్వదినం ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు.

ఈ క్రమంలోనే జన్మాష్టమి రోజు శ్రీ కృష్ణుడిని ఏవిధమైన పూలతో పూజించి.. ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. గోకులాష్టమి రోజు భక్తులు వారి ఇళ్లను అందంగా అలంకరించి..చిన్న కృష్ణున్ని ఆహ్వానిస్తూ తమ ఇంటి ముందు చిన్ని కన్నయ్య పాదాలను వేస్తారు.

చాలా మంది భక్తులు పగలంతా ఉపవాసం ఉండి.. సాయంకాలం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ కృష్ణుని పూజిస్తారు. అయితే, జన్మాష్టమి రోజు ఆ చిన్ని కన్నయ్యను నీలం రంగు పుష్పాలతో పూజిస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు అంటున్నారు. అలాగే.. తులసీదళాలంటే నల్లనయ్యకు మహాప్రీతి. కాబట్టి జన్మాష్టమి నాడు స్వామి వారిని తులసి దళాలతో ఆరాధించినా ఆయన సంపూర్ణ మైన అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి.

ఇకపోతే శ్రీకృష్ణాష్టమి నాడు ఈ సీజన్‌ లో లభించే పళ్లు, శొంఠి, బెల్లం కలిపిన పెరుగు, వెన్న, జున్ను, మీగడ, రుచికరమైన వంటకాల్లో ఏదైనా ప్రిపేర్ చేసి నల్లనయ్యకు నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయంట. అంతేకాదు.. శ్రీకృష్ణాష్టమి నాడు నల్లనయ్యను కొన్ని రకాల పుష్పాలతో పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుందంట.

అందులో భాగంగా గోకులాష్టమి రోజు కన్నయ్యను జాజిపూలతో పూజించినట్లయితే.. ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

సంపగి పూలతో పూజిస్తే.. శత్రు బాధలన్నీ తొలగిపోయి.. శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చంటున్నారు. అలాగే పారిజాత పూలతో ఆరాధిస్తే.. జాతకంలో ఉన్న పన్నెండు రకాల కాల సర్ప దోషాలను తొలగించుకోవచ్చని నమ్మకం.

పద్మ పుష్పాలతో కన్నయ్యను పూజిస్తే.. అష్టైశ్వర్యాలు సిద్ధించి శ్రీమంతులు అవుతారట. మల్లెపూలతో ఆరాధిస్తే.. శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయట. గన్నేరు పూలతో పూజిస్తే.. కవిత్వం, వాక్చాతుర్యం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

తుమ్మి పూలతో కృష్ణుడిని ఆరాధిస్తే.. ఆయన పట్ల భక్తి భావం మరింత పెరుగుతుంది. నందివర్ధనం పుష్పాలతో పూజిస్తే.. సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తాయట. తెల్ల జిల్లేడు పూలతో ఆరాధిస్తే.. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుందని, పొద్దు తిరుగుడు పుష్పాలతో పూజిస్తే.. . అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు.

ఇలా గోకులాష్టమి రోజు శ్రీ కృష్ణుడిని ఒక్కొక్క పూలతో పూజిస్తే ఒక్కొక రకమైన విశేషమైన ప్రయోజనం ఉంటుందని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు.

Also Rread: రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు!

The post Sri Krishnastami: మీరు పట్టిందల్లా బంగారం కావాలా..? అయితే ఆ చిన్ని కిట్టయ్యను ఈ పూలతో పూజించేయండి మరి! appeared first on Rtvlive.com.