- అభిమాని ఈశ్వరయ్య కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్
- చిరంజీవి పుట్టినరోజున తిరుమలకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లిన అభిమాని
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఫ్యాన్స్ ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా చిరంజీవి పుట్టిన రోజున ఓ అభిమాని పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లిన విషయం విదితమే. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈశ్వరయ్య అనే అభిమాని తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలియగానే చిరంజీవి, ఈశ్వరయ్య, ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్లోని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. వారికి కుటుంబానికి పట్టు బట్టలు పెట్టి సత్కరించటం విశేషం. ఈ సందర్భంగా ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారు.
Read Also: Thangalan: రూ.100 కోట్ల చేరువలో చియాన్ విక్రమ్ ‘తంగలాన్’
సోమవారం రోజున చిరంజీవి అయ్యప్ప మాలను ధరించారు. ప్రతీ ఏడాది అయ్యప్ప మాలను ధరించే ఆయన ఈ ఏడాది కూడా మాలను ధరించారు. మాలధారణలోనూ ఈశ్వరయ్య కుటుంబంతో చిరంజీవి కలిసి మాట్లాడారు. సాధారణంగా చిరంజీవి తన హార్డ్ కోర్ అభిమానులకు ఎప్పుడూ అండగా నిలుస్తుంటారు. చాలా సందర్భాల్లో ఇది నిరూపణ అయ్యింది. ఇప్పుడు ఈశ్వరయ్య గురించి తెలియగానే మరోసారి మెగాస్టార్ ఆయన్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. గతంలో ఈశ్వరయ్య తిరుపతి నుంచి మెగాస్టార్ ఇంటి వరకు సైకిల్ యాత్రను నిర్వహించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు, జనసేన పార్టీ నెగ్గాలని ఇలా అనేక సార్లు పొర్లు దండాలు చేయటం విశేషం. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య చిన్నప్పటి నుంచి చిరంజీవికి వీరాభిమాని అని తెలుస్తోంది. గత 21 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ అభిమాని పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిసింది.