• మత్తు వదలరా 2 టీజర్‌ విడుదల
  • రాజమౌళి రివ్యూ
  • సీక్వెల్‌పై భారీ అంచనాలు

SS Rajamouli About Mathu Vadalara 2 Teaser: 2019లో కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేశ్ రానా మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచింది. శ్రీసింహా, నరేష్ అగస్త్య, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌ల కామెడీ అందరినీ ఆకట్టుకుంది. ఇక రెట్టింపు వినోదం పంచేందుకు ఇప్పుడు సీక్వెల్‌ సిద్ధమైంది. పార్ట్‌ 2కు సంబందించిన టీజర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ టీజర్‌ చూసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తమ రివ్యూ ఇచ్చారు.

మత్తు వదలరా 2 టీజర్‌లోని డైలాగ్స్‌ సూపర్‌ అని, సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయ్‌ అని రాజమౌళి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ‘హీ హీ హీ.. హీ టీమ్‌. నా అబ్బాయిలు మత్తు వదలరా 2తో మళ్లీ వచ్చారు. టీజర్‌లోని డైలాగ్స్‌ మంచి ఫన్‌ను పంచాయి. విజువల్స్‌ అద్భుతం. సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబరు 13న టికెట్లు తస్కరించేందుకు అందరూ సిద్ధం’ అని రాజమౌళి రాసుకొచ్చారు. ఈ పోస్టుకు స్మైలీ ఎమోజీని జోడించారు. రాజమౌళి ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.

Also Read: Kalki 2898 AD 2: ‘కల్కి 2’లో కృష్ణుడి పాత్ర.. హీరో నాని ఏమన్నారంటే?

మత్తు వదలరా పార్ట్ 2లో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ పాటను రాయడమే కాదు.. ఆలపించడంతో పాటు కొరియోగ్రఫీ కూడా చేయడం విశేషం. కాల భైరవ మ్యూజిక్‌ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్‌లో సునీల్, అజయ్, రోహిణి కూడా కీలక పాత్రలు చేశారు.