Telangana: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం స‌హాయ‌క చ‌ర్యలను ముమ్మరం చేసింద‌ని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల‌ ప్రభుత్వ ఉద్యోగుల సైతం స‌హాయ‌క చ‌ర్యల్లో నిమ‌గ్నమ‌య్యారని తెలిపారు.

అయిన‌ప్పటికీ అనుకోని విప‌త్తు భారీ న‌ష్టాన్ని క‌లిగించింద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న త‌మ‌ను తీవ్రంగా క‌లిచివేసిందని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత అతిపెద్ద విప‌త్తు ఇదేనని అన్నారు. ఇలాంటి స‌మ‌యంలో త‌మ వంతుగా ప్రభుత్వానికి ఆర్ధిక ప‌రంగా చేయూత‌నిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం అంటే సుమారు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి త‌మ వంతు స‌హాకారంగా ఒకరోజు వేత‌నం వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్యలకు త్వరలోనే అందజేస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల త‌రుపున స‌మిష్టి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Also Read: వరదల్లో మునిగిన వాహనాలు.. దోపీడీకి రెడీ అయిన కేటుగాళ్లు

The post Telangana: వరద బాధితులకు 100 కోట్ల సాయం…ఉద్యోగుల జేఏసీ! appeared first on Rtvlive.com.