• కేబీసీ తాజా ఎపిసోడ్‌లో ఆదివాసీ కంటెస్టెంట్‌
  • కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్‌ కొద్దిలో మిస్‌
  • 50 లక్షలు గెలుచుకున్నాడు

Rs 1 crore question on Olympics in KBC 16 ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ కొనసాగుతోంది. బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‏గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ఓ ఆదివాసీ కంటెస్టెంట్‌.. ‘కోటీశ్వరుడు’ అయ్యే ఛాన్స్‌ను కొద్దిలో మిస్‌ అయ్యాడు. కోటి రూపాయల ప్రశ్నకు అతడు సమాధానం చెప్పలేకపోయాడు. రూ.50 లక్షలు తీసుకుని షో నుంచి వెళ్ళిపోయాడు. కోటి రూపాయల ప్రశ్నను అమితాబ్ ఒలింపిక్స్‌పై అడిగారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటో తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌ ఆదివాసి తెగకు చెందిన బంటి వడివా.. కౌన్ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చాడు. తాజా ఎపిసోడ్‌లో హాట్ సీట్‌లో కూర్చున్న బంటి.. హోస్ట్ అమితాబ్‌కు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. బంటి అద్భుత సమాధానాలతో రూ.50 లక్షలు గెలుచుకున్నాడు. ఇక కోటి రూపాయల ప్రశ్నను అమితాబ్ అడిగారు. సరైన సమాధానం చెప్పేందుకు అతడు చాలా ప్రయత్నించాడు. కానీ సమాధానం ఇవ్వడంపై సందేహంగా ఉండిపోయాడు. తప్పు సమాధానం చెపితే 50 లక్షలకు బదులుగా 3,20,000నే ఇంటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకోకుండా గేమ్ నుండి నిష్క్రమించాలని బంటి నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయాన్ని అమితాబ్ కూడా ప్రశంసించారు.

గెలిచిన డబ్బుతో తన కుటుంబానికి ఇళ్లు కట్టిస్తానని బంటి వడివా తెలిపాడు. తన కోచింగ్ కోసం కూడా ఈ డబ్బును వాడుకుంటామని చెప్పాడు. బంటి నిష్క్రమణ తర్వాత హాట్‌సీట్‌కి ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్ మరియు అమన్ సెహ్రావత్ వచ్చి సందడి చేశారు. ఇంతకీ బంటి సమాధానం చెప్పలేకపోయిన ప్రశ్న ఏంటంటే.. ‘ది స్టాగ్ అనే ఆర్ట్‌ వర్క్‌కు బెంగాలీ శిల్పి చింతామోని కర్‌ను వరించిన పతకమేది?’. 1948లో ఒలింపిక్ గేమ్స్‌లో కళల పోటీలు కూడా ఉందని, చింతామోని కర్‌ తన కళాకృతికి ఒలింపిక్‌ రజత పతకాన్ని గెలుచుకున్నారని అమితాబ్ చెప్పారు.

ప్రశ్న: ది స్టాగ్ అనే ఆర్ట్‌ వర్క్‌కు బెంగాలీ శిల్పి చింతామోని కర్‌ను వరించిన పతకమేది?

ఆప్షన్స్‌: ఎ. పైథాగరస్ బహుమతి
బి. నోబెల్ బహుమతి
సి. ఒలింపిక్ పతకం
డి. ఆస్కార్ పతకం