• జానీ మాస్టర్‌ అరెస్ట్
  • నాగబాబు ట్వీట్స్ వైరల్
  • మెగా ఫ్యామిలీతో జానీకి సన్నిహిత సంబంధాలు

గత కొద్దిరోజులుగా ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీ బాషా పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతోన్న విషయం తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నేడు ఉదయం బెంగళూరులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం అతడిని బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు.

జానీ మాస్టర్‌ అరెస్టైన వేళ సినీ నటుడు నాగబాబు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’ అని బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో కొటేషన్‌ను నాగబాబు రాసుకొచ్చారు. ‘మీరు విన్న ప్రతిదాన్ని నమ్మవద్దు. ప్రతి కథకు మూడు పార్శ్వాలు ఉంటాయి. మీ వైపు, నా వైపు మరియు నిజం’ అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్‌ను మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ రెండు ట్వీట్‌లలో జానీ మాస్టర్ గురించి నాగబాబు ఏమీ మాట్లాడకపోయినా.. వాటి అర్ధాలను చూస్తే జానీ కోసమే వేసినట్టు ఉంది.

Also Read: Kanguva Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘కంగువా’ కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

సర్ విలియం గారో, రాబర్ట్ ఎవాన్స్ కొటేషన్‌లను నాగబాబు ట్వీట్ చేయడంతో నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. ఇందుకు కారణం లేకపోలేదు. జానీ మాస్టర్ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు మెగా ఫ్యామిలీతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జానీ మాస్టర్‌కు నాగబాబు మద్దతు ఇచ్చారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.