తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పేషీలో స్వల్ప మార్పులు చేస్తున్నారు. తాజాగా మహిళా అధికారిణికి సీఎం కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న దివ్యరాజన్ కు ఆ అవకాశం దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దివ్యరాజన్ 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వివాద రహితురాలిగా, బెస్ట్ ఆఫీసర్ గా ఆమెకు పేరుంది. దీంతో ఆమెను తన పేషీలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ప్రజా దర్బార్ సక్సెస్ లో కీలకం..

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్‌ను ఆమె సమర్ధంగా నిర్వహించడంతో సీఎం దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలనకు సంబంధించి ఆమె చేసిన కృషి కూడా సీఎంలో చోటు దక్కేందుకు మరో కారణమని సమాచారం. ప్రభుత్వం అమలు చేసే అనేక కార్యక్రమాల్లో మెజార్టీ లబ్ధిదారులు గ్రామాల్లోని ప్రజలే ఉంటారు.

ఈ నేపథ్యంలో ఆయా పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడానికి దివ్యరాజన్ అనుభవం పనికి వస్తుందని సీఎం భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సీఎంఓలో పని చేస్తున్న అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్నంత వేగంగా పనులు జరగకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. దీంతో ఇద్దరు అధికారులను సీఎంఓ నుంచి తొలగించనున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దివ్యరాజన్ కు సీఎంఓలో చోటు దక్కనున్నట్లు చర్చ సాగుతోంది.

ఇది కూడా చదవండి: Johnny Master తో టార్చర్.. రేప్ కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్!