సీఎం రేవంత్ రెడ్డి: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణను వేరే రాష్ట్ర హైకోర్టు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి తరఫున న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం.. రేవంత్ తరఫున న్యాయవాదుల వాదనలతో ఏకీభవించింది. ఈ కేసును వేరే రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేసేందుకు నిరాకరించింది. విచారణను సీఎం ప్రభావితం చేస్తారనే అపోహలు తప్ప ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ దశలో జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ ను ఎంటర్‌టైన్ చేయలేమని స్పషం చేసింది.

రేవంత్‌కు ఆదేశాలు…

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణలో జోక్యం  చేసుకోవద్దని తేల్చి చెప్పింది. ఈ కేసు వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది. రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు నిరాకరించింది. భవిష్యత్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసులో  జోక్యం చేసుకుంటే పిటిషనర్ మరోసారి సుప్రీం కోర్టు ఆశ్రయించవచ్చని పేర్కొంది.

ఈ కేసు ఏంటి?

2015లో తెలంగాణ (తెలంగాణ) లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నించారని తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చర్చలు జరిపిన వీడియోను సైతం ఏసీబీ విడుదల చేయడంతో అది సంచలనంగా మారింది. ఆ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లారు.

ఈ సందర్భంగా చంద్రబాబు స్టీఫెన్ సన్ తో జరిపిన ఫోన్ సంభాషణలు కూడా బయటకు రావడంతో కేసు మరింత సంచలనంగా మారింది. నాటి సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీలో దోచుకున్న డబ్బుతో చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు.