Tirumala Laddu: ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం రోజుకు రోజుకు ముదురుతోంది. వైసీపీ హయాంలో జంతువుల నూనెతో లడ్డూ తాయారు చేశారని టీడీపీ వాళ్ళు.. లేదు ఇది కూటమి ప్రభుత్వంలో ఇలా జరిగింది అని వైసీపీ వాళ్ళు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఇదే అంశంపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు లంచ్‌ మోషన్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను వచ్చే బుధవారం విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.

తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి వాస్తవాలు బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల లడ్డూపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సర్కార్ చెప్పింది. దేవుడిపై తప్పుడు ప్రచారం ఏంటని వైసీపీ మండిపడుతోంది. కాగా తాజాగా వైసీపీ కోర్టును ఆశ్రయించడంతో దీనిపై ధర్మసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో…

ఇటీవల తిరుపతి లడ్డూలో జంతు కళేబరం ఆయిల్ కలిపారంటూ ఏసీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు చేశారు. బుధవారం ఎన్డీఏ కూటమి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన ఆయిల్ వాడారని అన్నారు. ఈ విషయం తెలియగానే తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు. అయితే ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నామని, ప్రజలకు స్వచ్ఛమైన భోజనం, ప్రసాదం అందించడమే తమ లక్ష్యమన్నారు.

నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్..

‘తిరుపతి ప్రసాదం, భోజనంలో నాసిరకమైన సరుకులు వాడారు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నాం’ అని సీఎం చెప్పారు. ఇదిలా ఉంటే.. వరదల కారణంగా రూ. 350 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని తెలిపారు. ఇదొక చరిత్రగా పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఒప్పుకుంటే ఎన్డీఏ ఎమ్మెల్యేలు అందరం ఒక నెల జీతం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇద్దామని ఈ సందర్భంగా కోరారు.