వరి బోనస్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఖరీఫ్ సీజన్ నుంచే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.  కాగా ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

బీఆర్ఎస్ విమర్శలు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శల బాణాలను విసురుతున్నాయి. ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవాలని చెప్పి కాంగ్రెస్ అమలు చేసేందుకు వీలు కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఫైర్ అయింది. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని బీజేపీ నేతలు విమర్శించారు. ఎన్నికల సమయంలో వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. అధికారంలోకి రాగానే కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం దారుణమని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. రైతులను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

నిన్న కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..

* రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్వర్యంలో 12 మందితో కమిటీ ఏర్పాటు చేసింది.
* ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమును ఎస్పీఎఫ్‌కు కూడా వర్తింపజేసింది.
* తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌కు భూమి కేటాయించింది.
* ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 58 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
* ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్‌కు 34 మంది సిబ్బంది మంజూరు చేసింది.
* రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 3 వేల పోస్టుల మంజూరు చేసింది.
* ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులను రెండేండ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి రైతుల చిరకాల కోరికను నెరవేర్చేందుకు సిద్ధమైంది.
* కోస్గి ఇంజనీరింగ్ కాలేజీకి, హకీంపేటలో జూనియర్ కాలేజీకి అవసరమైన పోస్టులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది.