వైసీపీ పాలనలో మొత్తం 300 ఆలయాలను అపవిత్రం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో స్వామి వారి పూజా విధానాలను మార్చేశారని ధ్వజమెత్తారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. ఏ మతమైనా.. ఏ ప్రార్థనా మందిరం అయినా.. భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదన్నారు. ప్రసాదాలు కల్తీ జరుగుతోందని.. నాణ్యత లేదని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. టీటీడీపై వైట్ పేపరు రావాలని కోరుకున్నామన్నారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్యకి కల్తీ చేసిన లక్షల లడ్డూలు పంపించారన్నారు.

ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు..

తాము తిరుమల వ్యవహారాన్ని రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నామని వైసీపీ అంటోందన్నారు. అలాగైతే రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే తాను రోడ్డు మీదకు వచ్చేవాడినన్నారు. ఆ రోజు తాను రాజకీయం చేయలేదని గుర్తు చేశారు. దాడులు జరుగుతున్నప్పుడు చూస్తూ కూర్చుకోడం కూడా తప్పేనన్నారు. ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. పగ, ప్రతీకారం తీర్చుకునే ప్రభుత్వం తమది కాదన్నారు. వైసీపీకి తప్పులు చేయడం అలవాటైందన్నారు. దీనికి పుల్ స్టాప్ పెట్టాలన్నారు.

చర్చి, మసీదులో జరిగితే ప్రపంచం అంతా గొడవ చేస్తారని.. మరి హిందువులకు మనోభావాలు ఉండవా? అని ప్రశ్నించారు. ఇదే ఇతర మతాలకు అన్వయిస్తారా? అని అన్నారు. సనాతన ధర్మం ఒకరు ప్రారంభించింది కాదన్నారు. అన్ని విశ్వాసాలను దగ్గరకు తీసుకున్న నేల ఇదన్నారు. చర్చి, మసీదులో ఇలా జరిగితే జగన్ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనుకేసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు.

కేబినెట్, అసెంబ్లీ లో ఈ అంశంపై చర్చ జరగాలన్నారు. సీబీఐ  విచారణకు ఇవ్వాలో? వద్దో? సీఎం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆయన వెనుకే ప్రజలంతా ఉంటారన్నారు. నెయ్యి తక్కువ ధరకు ఇస్తారని చెప్పిన మధ్యవర్తి ఎవరో తేలాలన్నారు. స్వామి వారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే హిందు అధికారులు, బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదన్నారు. టీటీడీ ఉద్యోగులు సైలెంట్ గా ఉండి మహా అపరాధం చేశారన్నారు. అందుకే తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టానన్నారు.