• ఎస్ఎస్ఎంబీ 29 కోసం మేకోవర్‌
  • లుక్ బయటకు రాకుండా మహేష్ జాగ్రత్తలు
  • సూపర్ స్టార్ పూర్తి లుక్ బయటకు

Mahesh Babu New Look Pics Goes Viral: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మూవీ కోసం టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేశ్‌ బాబు బాగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబీ 29’ కోసం పూర్తిగా మేకోవర్‌ అవుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజమౌళి సినిమాలో మహేశ్‌ కనిపించనున్నారని టాక్. ఇటీవలి రోజుల్లో మహేష్ తన నయా లుక్‌ను బయటకు రానివ్వకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఈవెంట్స్, వెకేషన్‌లకు వెళ్లినప్పుడు కూడా తన లుక్‌ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ పూర్తి లుక్ బయటకు వచ్చేసింది.

నేడు మహేష్ బాబు తన సతీమణి నమత్రతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితులకు ప్రకటించిన రూ.50 లక్షల విరాళం చెక్‌ను సీఎంకు అందజేశారు. ఇందుకు సంబంధించిన పోటోలను తెలంగాణ సీఎంఓ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేశ్‌ టీషర్ట్, జీన్స్ వేసుకున్నారు. పొడవాటి జుత్తు, గడ్డంతో మహేశ్‌ నయా లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘మహేష్.. ఎమన్నా ఉన్నాడా’, ‘అన్న హాలీవుడ్ మెటీరియల్’ అంటూ నయా లుక్‌పై ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Mahesh Babu: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ బాబు.. మరో 10 లక్షల విరాళం!

మహేశ్‌ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29 తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. ‘గరుడ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాక్‌. దుర్గా ఆర్ట్స్‌పై కెఎల్‌ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.