Koratala Shiva: డైరెక్టర్ కొరటాల శివ త్వరలోనే దేవర సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇండస్ట్రీలో ఈయన చేసినది తక్కువ సినిమాలే అయినప్పటికీ అన్ని సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా కీర్తి పొందిన కొరటాల శివకు ఆచార్య సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ ఇచ్చింది.

చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా భారీ స్థాయిలో నష్టాలను తీసుకువచ్చింది. ఈ సినిమా తరువాత కొరటాల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే కొరటాల శివ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.. ఈ క్రమంలోనే ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత చిరంజీవితో వచ్చిన భేదాభిప్రాయాలు గురించి ఈయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చిరంజీవి మెసేజ్ చేశారు..
ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నాకు మొదటిగా మెసేజ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి గారేనని తెలిపారు. ఇంటర్వ్యూలలో చిరంజీవి మాట్లాడిన వ్యాఖ్యలను అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నారని, మా మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఇక ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే దేవర సినిమా పనులలో లీనం అయిపోయాను అంటూ కొరటాల కామెంట్స్ చేశారు.