Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఉన్న కనక దుర్గ ఆలయంలో ఆయన శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత ఆయన మెట్లను శుభ్రం చేశారు. ఆ మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోఛ్చారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం దుర్గమ్మను పవన్‌ దర్శించుకున్నారు. ఎంపీలు కేశినేని శివనాథ్‌, బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు పవన్‌ అక్టోబర్‌ 1న తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్లనున్నారు. 2న ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఆయన దీక్ష విరమించనున్నారు.

వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని పవన్‌ అన్నారు.అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలని అన్నారు. వైసీపీ నేతల తీరు పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా పై విమర్శలు కాదు..అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యతేంటని ఆయన ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతోంది. ఇప్పటికీ వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. సున్నిత అంశాల పై ఆ పార్టీ నేత పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం. సనాతన ధర్మం జోలికి రావొద్దు. తప్పు జరిగితే ఒప్పుకోవాలి…లేకపోతే సంబంధం లేదని చెప్పండి. అంతేకానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయోద్దని పవన్‌ అన్నారు.