ఆర్ కృష్ణయ్య చంద్రబాబుకు అమ్ముడు పోయారని వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు సంచలన ఆరోపణలు చేశారు. బీసీలకు మంచి చేస్తారని కృష్ణయ్యకు జగన్ రాజ్యసభ పదవి ఇచ్చారన్నారు. ఇప్పుడు రాజీనామా చేసి ఆయన చరిత్ర హీనుడిగా మిగిలాడని ధ్వజమెత్తారు. కృష్ణయ్యను ప్రజలు క్షమించరని ఫైర్ అయ్యారు. చంద్రబాబు బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి అని ఆరోపించారు. బీసీలకు జగన్ రాజ్య సభ సీట్లు ఇస్తే వాటిని వేరే వారికి ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజ్యసభ సీట్లు కొని, అమ్ముకొనే దళారిగా చంద్రబాబు మారారని ఆరోపించారు. వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజా ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని ఫైర్ అయ్యారు.

తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం..

తిరుపతి లడ్డు పేరుతో వైఎస్ జగన్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూపై టీటీడీ ఈవో ఒక మాట చంద్రబాబు మరో మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. సూపర్ సిక్స్ నుంచి ప్రజల దృష్టి మార్చడం కోసం చంద్రబాబు లడ్డూ అంశం ఎత్తుకున్నాడని ధ్వజమెత్తారు. సీబీఐ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కారుమూరి.