• జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు
  • జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • మీడియాతో మాట్లాడిన జానీ సతీమణి

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీ బాషా పేరు టాలీవుడ్‌లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్‌ అరెస్ట్ అనంతరం ఆయన సతీమణి సుమలత అలియాస్‌ ఆయేషా స్పందించారు. ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. తన భర్తను వదిలేస్తా అని సవాల్ చేశారు. తన భర్త ఎప్పుడూ ప్రతిభను ప్రోత్సహించేవారని చెప్పారు.

జానీ మాస్టర్‌ సతీమణి సుమలత మీడియాతో మాట్లాడుతూ… ‘టాప్ కొరియోగ్రాఫర్‌గా లేదా హీరోయిన్‌గా స్థిరపడాలనేది ఆ అమ్మాయి కోరిక. ఆమె తల్లి కూడా ఇదే కోరుకునేది. స్టేజ్‌ షోల నుంచి వచ్చిన ఆమె.. సినీ రంగాన్ని చూసి లగ్జరీ లైఫ్‌ కావాలని కోరుకుంది. ఎవరైనా తనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనుకునేది. మైనర్‌గా ఉన్నప్పుడు అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యమేంటి?, నా భర్త జానీ మాస్టర్‌తో సాన్నిహిత్యంగా ఉందని ఎవరైనా చూశారా?, ఇప్పటివరకూ ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా?, అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడటానికి ఏమైంది?’ అని ప్రశ్నించారు.

‘ఆ అమ్మాయి లైంగిక వేధింపులకు గురైతే జానీ మాస్టర్‌ వద్ద పని చేయడం నా అదృష్టం అని నవ్వుతూ ఎందుకు చెబుతుంది. మాస్టర్‌ గురించి మాట్లాడినపుడు ఆమె ఇబ్బంది పడినట్టు కనిపించలేదు. అసోషియేషన్‌ కార్డు పొందేందుకు ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేకపోతే మాస్టర్‌ ఇప్పించారు. మాస్టర్‌ తన సినిమాలలో కొరియోగ్రాఫర్‌గా కూడా అవకాశం ఇచ్చారు. నా భర్త ప్రతిభను ప్రోత్సహించేవారు. అలాంటి ఆయన ఎవరికైనా అవకాశాల్లేకుండా ఎందుకు చేస్తారు. ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా’ అని సుమలత అన్నారు.