వైసీపీ అధినేత జగన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. జనసేనలో చేరేందుకు వైసీపీ నేతల క్యూ కడుతున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు త్వరలో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల వైసీపీని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వీడిన సంగతి తెలిసిందే. 

చిరంజీవితో మీటింగ్..

ఎంపీ బాలశౌరితో కలిసి చిరంజీవి ఇంటికి దాడిశెట్టి రాజా వెళ్లారని ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరికపై చిరు ముందు మాజీ మంత్రి ప్రపొజల్ పెట్టినట్లు తెలుస్తోంది. నాగబాబుతో చిరంజీవి మాట్లాడినట్లు ప్రచారం నడుస్తోంది. ప్రజారాజ్యం ద్వారానే రాజకీయాల్లోకి దాడిశెట్టి రాజా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నిక తర్వాత దాడిశెట్టి రాజా సోదరుడు శ్రీనివాస్ జనసేనలోకి వెళ్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే బాటలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల జగన్ పర్యటనకు  తోట త్రిమూర్తులు దూరంగా ఉండడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. సామినేని ద్వారా జనసేనలోకి వెళ్తారని ప్రచారం నడుస్తోంది. జనసేన నుంచి క్లారిటీ రాగానే పార్టీలో చేరనున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది.

మూడు రోజుల్లో ముగ్గురు…

మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నేతల రాజీనామాలతో ఇక్కట్లు పడుతున్న జగన్ కు మరో నేత వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన టీడీపీ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. అలాగే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా వరుసగా నేతలు రాజీనామాలు చేయడంపై వైసీపీ చీఫ్  జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని వేచి చూడాలి. ఇదిలా ఉంటే తమతో మరికొంత వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారని జనసేన నేతలు బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారు.