బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి హెచ్చరించారు. ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ పదేళ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు నీతులు చెప్పేందుకు యత్నించడం సిగ్గు చేటంటూ ఎక్స్‌ వేదికగా విమర్శలు చేశారు. ” మీ హయాంలో హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారు. ఈహెచ్‌ఎస్ కింద ట్రీట్‌మెంట్ కోసం పోయిన ఉద్యోగులు, పెన్షనర్లను కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు అవమానిస్తుంటే చోద్యం చూశారు. మా వేతనాల్లో నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తాం, స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయండని ఉద్యోగులు, పెన్షనర్లు కోరినా పట్టించుకోలేదు. పదేళ్లు మోసం చేసింది చాలదన్నట్టు, ఎన్నికల ముందు హడావుడిగా ఓ డమ్మీ జీవో ఇచ్చి మరోసారి ఉద్యోగులను మోసం చేసే కుట్రలు చేశారు.

Also Read: తిరుపతి లడ్డూలోనే కాదు.. స్ట్రీట్ ఫుడ్ లోనూ జంతువుల నూనె?

మీ కుట్రలు, కుతంత్రాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు ఉద్యోగులు. బీఆర్‌ఎస్ నేతలు ఇకనైనా ఇలాంటి చవకబారు‌ విమర్శలు మానుకోవాలి. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ‌‌ కింద ఉచిత వైద్యం పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాం. పదేండ్లలో మీరు చేయలేకపోయిన ప్యాకేజీల రివిజన్‌ను 6 నెలల్లోనే‌ చేసి చూపించాం. కొత్తగా 163 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఉద్యోగులు, పెన్షనర్లు కోరుకున్నట్టుగా వారికి ఆమోదయోగ్యమైన రీతిలో ఈహె‌చ్‌ఎస్‌ను అమలు చేయబోతున్నామని” తెలిపారు.