లిక్కర్‌ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ బెయిల్‌ విడుదలయ్యాక సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజగా కొత్త ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. వచ్చే ఎన్నికల తన నిజాయతీని నిరుపించుకొని మళ్లీ సీఎం అవుతానని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటన చేశారు. మరోవైపు బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో ఆప్‌ను గద్దె దించి అధికారంలోకి రావాలని తమ వ్యూహాలకు పదును పెడుతోంది. తమ వ్యూహాల్లో భాగంగానే మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Also Read: బెంగళూరులో దారుణ ఘటన.. యువతిని 32 ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో..

ఇప్పటికే ఢిల్లీ సభ్యత్వ బాధ్యతలను ఆమెకు అప్పగించిన బీజేపీ.. మరిన్ని బాధ్యతలు కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2015లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ మాజీ ఐపీఎస్‌ కిరణ్‌బేడిని సీఎంగా ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో కిరణ్‌బేడీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. 70 స్థానాలకు గానూ బీజేపీ 3 స్థానాల్లోనే గెలిచింది. ఆ తర్వాత 2020 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండగానే బీజేపీ బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బే తగిలింది. కేవలం 8 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ 2019,2024 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఏడింటికి ఏడు ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బోల్తా పడుతోంది. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు అధికారం ఇవ్వకూడదని గట్టి పట్టుదలతో ఉంది కమలం పార్టీ.

ఈ క్రమంలోనే స్మృతి ఇరానీని ఢిల్లీ రాజకీయాల్లో యాక్టివ్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీకి చెందిన 14 జిల్లా యూనిట్లలో ఏడింటికి సభ్యత్వ నమోదు బాధ్యతలను ఆమెకు కట్టబెట్టింది. అంతేకాదు సెప్టెంబర్‌ 2 నుంచి స్మృతి ఇరాని ఢిల్లీలోని ప్రతి వార్డులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. దక్షిణ ఢిల్లీలో ఇప్పటికే ఆమె ఒక ఇంటిని కూడా కొనుగోలు చేశారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో అమేధీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్‌ శర్మ చేతిలో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే తాజాగా ఆమెకు ఢిల్లీ బాధ్యతలు అప్పగించడంపై రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

Also Read: బాత్రూంల్లో స్పై కెమెరాలు.. గుడ్లవల్లేరు ఘటన రిపీట్‌!

మరోవైపు ఢిల్లీలో ఇప్పటికే బీజేపీ తరఫున దివంగత నేత సుష్మా స్వరాజ్‌ కుమార్తె, ఎంపీ బాసూరీ స్వరాజ్‌ యాక్టివ్‌గా ఉన్నా కూడా ఆమె తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమెతో సహా ఎంపీలు ప్రదీప్‌ ఖండేల్‌వాల్‌, మనోజ్‌ తివారీ, కామజీత షెరావత్, ఢిల్లీ బీజీపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వంటి సీనియర్లు సీఎం ముఖాలుగా ఉన్నారు. కానీ వాక్‌చాతుర్యం, గాంధీ కుటుంబ వ్యతిరేక భావాజాలమున్న స్మృతి ఇరానీనే సరైన మార్గమని బీజేపీ భావిస్తోంది. అంతేకాదు ఆప్‌ కొత్త సీఎం అతిషీని ఎదుర్కొనేందుకు స్మృతి ఇరానీనే సరిగ్గా సరిపోతారనే ప్రచారం నడుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను ఆమెకు అప్పగించే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.