ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తన జైలు జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తానూ పార్టీ మారకపోతే జైల్లోనే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని తెలిపారు. ఆప్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన జనతాకీ ఆదలత్‌ కార్యక్రమంలో ఆయన ఈ మాట్లాడారు. ” జైల్లో నన్ను బెదిరించేందుకు ప్రయత్నించారు. లిక్కర్ కేసులో కేజ్రీవాలే నా పేరు చెప్పి ఇరికించారని చెప్పేవారు. కోర్టు ముందు కేజ్రీవాల్ గురించి చెబితే నన్ను కాపాడుతామన్నారు. బీజేపీలో చేరాలని ఆ పార్టీకి చెందిన వ్యక్తుల నుంచి ఒత్తిడి వచ్చింది. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు యత్నించారు.

Also Read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. స్మృతి ఇరానీకి పగ్గాలు అప్పగించనున్న బీజేపీ

బీజేపీలో చేరకుంటే చంపేస్తామన్నారు. నువ్వు చనిపోతే నీ గురించి ఆలోచించేవారు ఎవరూ ఉండరని.. అనారోగ్యంతో ఉన్న నీ భార్య గురించి ఆలోచించుకోవాలని చెప్పారు. కొడుకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. నాపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. కానీ కేజ్రీవాల్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని” మనీశ్‌ సిసోడియా అన్నారు.

మరోవైపు జైల్లో ఉన్నప్పుడు తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి కూడా మనీశ్‌ సిసోడియా వివరించారు. ” నేను జర్నలిస్టుగా పనిచేసినప్పుడు 2002లో రూ.5 లక్షలతో ఓ ఫ్లాట్ కొన్నాను. అలాగే నా బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు ఉండేవి. వాటిని నా కొడుకు ఫీజు కోసం దాచానని చెప్పినా కూడా ఈడీ ఆ అకౌంట్‌ను నిలిపివేసింది. అలాంటి టైమ్‌లో ఫీజు కోసం చాలామందిని సాయం అడగాల్సి వచ్చిందని” సిసోడియా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. లిక్కర్ కేసులో సిసోడియా దాదాపు 17 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఇటీవలే ఆయన ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

Also Read: అమూల్ నెయ్యిపై తప్పుడు ప్రచారం చేసినందుకు.. ట్విట్టర్ యూజర్లపై ఫిర్యాదు