శ్రీలంక: శ్రీలంక అధ్యక్షుడిగా మార్క్సిస్ట్‌ నేత అనుర కుమార దిసనాయకే ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే అత్యధిక ఓట్ల మెజార్టీ సాధించి ప్రెసిడెంట్ పదవి సొంతం చేసుకున్నారు. మొత్తం పోలైన ఓట్లలో 42.31 శాతం అనుర కుమారకు వచ్చినట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే తొలి రౌండులోనే పోటీ నుంచి వైదొలిగారు. విపక్షనేత సాజిత్‌ ప్రేమదాసకు 32.76శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. శ్రీలంక ప్రెసిడెంట్ గా అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (NPP) పార్టీ స్పష్టం చేసింది.

45 రోజుల్లోగా పార్లమెంట్ రద్దు..

శ్రీలంకలో 2022లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేశారు. దీంతో ఇటీవల శ్రీలంక అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి.  శ్రీలంక అధ్యక్ష పదవి రేసులో మార్క్సిస్ట్ నాయకుడు అయిన అనుర కుమార దిసానాయకే మొదటినుంచి ముందంజలో ఉన్నారు. ఇక జనతా విముక్తి పెరెమునా పార్టీ అధినేత అయిన దిసానాయకే.. నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. జనతా విముక్తి పెరెమునా పార్టీకి పార్లమెంట్‌లో మూడు స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అధికారం పొందితే 45 రోజుల్లోగా పార్లమెంట్ రద్దు చేస్తామనే హామీలిచ్చారు. పేదలకు కొత్త విధానాలు తీసుకురావడం, అవినీతికి వ్యతిరేక చర్యలు తీసుకుంటామని దిసానాయకే ప్రజలకు హామీ ఇచ్చారు.