ఒకప్పుడు తమిళ, మలయాళ చిత్రాల్లో హాటెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న నటి కనక ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై మాల్‌లో ఓ అభిమాని తీసిన ఫోటోలలో ఉన్నది కనక ఏనా అని అభిమానులు సందేహ పడుతున్నారు. ఇరవై ఐదేళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న కనక చుట్టూ ఎన్నో ప్రచారాలు చుట్టుముట్టాయి. వాటిలో కొన్ని కనకకు క్యాన్సర్ వచ్చిందని, చనిపోయిందని కూడా ఉన్నాయి. కనక, ఆమె తండ్రి మధ్య ఆస్తి వివాదం కూడా వివాదాస్పదమైంది. తన తండ్రి తనను సైకోపాత్‌గా చిత్రీకరిస్తున్నాడని, తన ఆస్తి, పొదుపు అంతా తన తండ్రి ఎత్తుకెళ్లాడని కనక అప్పట్లో కామెంట్ చేసింది. తెలుగులో ఆమె సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించింది.

ఒకానొక సమయంలో తమిళ సినీ ప్రపంచాన్ని ఏలిన నటి దేవిక కుమార్తెగా కనక నట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమా కరకట్టకారన్‌ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం నుంచి అవకాశాలు వచ్చాయి. కనకకు అమ్మ సర్వస్వం. కనక చిన్నతనంలోనే దేవిక, ఆమె భర్త దేవదాస్ విడిపోయారు. తర్వాత తల్లీ, కూతురు ఒంటరిగా ఉండేవారు. తల్లి చనిపోవడంతో కనకకు ఎవ్వరూ లేరు. తల్లి మరణం తర్వాత కనక నటనకు దూరంగా ఉంది. ఆ తర్వాత కొంత కాలం వరకు కనక గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆ తర్వాత కనక తన భర్త కనిపించడం లేదంటూ మీడియా ముందుకు రావడంతో ఆ నటి పెళ్లి చేసుకుందని కూడా జనాలకు తెలిసింది.

కాలిఫోర్నియాలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న ముత్తుకుమారన్‌తో తనకు 2017లో వివాహమైందని, 15 రోజుల తర్వాత తన భర్త కనిపించకుండా పోయాడని కనక మీడియాకు తెలిపారు. అయితే తన కుమార్తెకి వివాహం అవలేదని,ఆమె మానసికంగా కుంగిపోయిందని ఆమె తండ్రి దేవదాస్ వెల్లడించారు. ఇక కనక మరణించినట్టు కూడా మీడియా చాలాసార్లు రిపోర్ట్ చేసింది. అయితే ఆమె వ్యక్తిగతంగా అన్నింటినీ ఖండించింది. 2021లో కనక మళ్లీ సినిమాల్లోకి రావాలనే కోరికతో సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది కానీ ఆమెకు అవకాశాలు రాలేదు. అయితే బయటి ప్రపంచంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన కనక ఇప్పుడు చెన్నైలోని షాపింగ్ మాల్ ఫొటోలతో ఆమె హాట్ టాపిక్ అయింది.