పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘కల్కి’. నాగ్ అశ్విన తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ జూన్29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ప్రస్తుతం కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కనీవినీ ఎరగని కలెక్షన్లు సాధిస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.900 కోట్లు దాటేసిన కల్కి 1000 కోట్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ మూవీని చూస్తున్నారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్, మోహన్ బాబు తదితర హీరోలు కల్కి సినిమాను వీక్షించి యూనిట్ కు అభినందనల తెలిపారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రభాస్ సినిమాను వీక్షించాడు. అనంతరం ట్విట్టర్ వేదికగా కల్కి టీమ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే తన దైన శైలిలో రివ్యూ ఇచ్చాడు మహేశ్ బాబు.

‘కల్కి సినిమా కి ఓ అద్భుతం.. జస్ట్‌ వావ్‌. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ కళాఖండంలా ఉంది. అమితాబ్‌ బచ్చన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌కు ఎవరూ సరితూగరు. కమల్‌ హాసన్‌ ప్రతి పాత్రకు ప్రాణం పోస్తారు. ప్రభాస్‌ గొప్ప క్యారెక్టర్‌లో చాలా సులభంగా నటించారు. ఇక దీపిక ఎప్పటిలాగే అద్భుతంగా నటించింది. ఇంతటి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతీ మూవీస్‌కు అభినందనలు’ అని రాసుకొచ్చాడు మహేశ్ బాబు. దీనికి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా స్పందిస్తూ ధన్యవాదాలు చెప్పాడు. ‘మీ అభినందనలు అందుకోవడం మా టీమ్‌కు ఆనందంగా ఉంది’ అని రిప్లై ఇచ్చారు. అలాగే కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా మహేశ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపింది .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.