పాన్ ఇండియా సినీ ప్రియులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ మనీషా కొయిరాలా. బొంబాయి సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యింది. అరవింద్ స్వామి నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మనీషాకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మనీషా.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ సమస్యతో పోరాడి గెలిచింది. చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవల డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హిరామండి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రియులను అలరించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా కొయిరాలా.. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. “కెరీర్ ప్రారంభంలో ఫోటోషూట్స్ చేస్తామని కొందరు అడిగేవారు. ఆ సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ నాపై తెగ ప్రశంసలు కురిపించాడు. నేను కచ్చితంగా సూపర్ స్టార్ అవుతానని అన్నాడు. ఆ తర్వాత టూ పీసెస్ డ్రెస్ వేసుకుంటానని.. సినిమాల్లో అవకాశాల కోసం ఇలాంటి డ్రెస్ వేసుకోను అని నిర్మొహటంగా చెప్పేశాను. దీంతో ఆయన నన్ను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కరగడానికి నిరాకరించే మట్టిముద్ద నుంచి ఎవరూ బొమ్మను తయారు చేయలేరు అని వెళ్లిపోయాడు. అతడి మాటలను నేనెప్పటికీ మర్చిపోలేను. అందరి మనస్తత్వం ఒకేలా ఉండదని అప్పుడే అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత నా సినిమాలు హిట్ అయ్యాక.. నేను పెద్ద సెలబ్రెటీ అయ్యాక అతడే వచ్చి నా ఫోటోషూట్ చేశాడు” అంటూ గుర్తుచేసుకుంది.

మనీషా కొయిరాల… సినిమాల్లో టాప్ హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా ప్రేమలో మోసపోయింది… అలాగే పెళ్లైన ఏడాదిలోపే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా ఉంటున్న మనీషా.. సరైన వ్యక్తి వస్తే తన జీవితంలో ఆహ్వానించేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.