బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈరోజు బుధవారం (జూలై 10) తర్వాత ఆమెను విచారించనున్నారు. ముందు నుంచి జాక్వెలిన్ ప్రియుడు సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు​జారీ చేయడం ఇదే తొలిసారి కాదు. రూ.200 కోట్ల దోపిడీ కేసులో ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు సుకేష్ చంద్రశేఖర్. ఈ కేసుకు పూర్వం జాక్వెలిన్, సుకేష్ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం.

ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌తో సహా ఉన్నత స్థాయి వ్యక్తులను మోసం చేసిన ఆరోపణలతో జాక్వెలిన్‏ను పలుమార్లు విచారించింది ఈడీ. ఫెర్నాండెజ్‌కు బహుమతులు కొనుగోలు చేయడానికి చంద్రశేఖర్ అక్రమంగా డబ్బును ఉపయోగించాడని ఈడీ ఆరోపించింది. 2022లో దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో సుకేషన్ చంద్రశేఖర్ అందించిన విలువైన వస్తువులు, నగలు, ఖరీదైన బహుమతులను జాక్వెలిన్ తీసుకుందని.. అప్పటికే అతడి గురించి పూర్తి వివరాలు తెలిసినప్పటికీ జాక్వెలిన్ అతడి ప్రేమను అంగీకరించిందని తెలిపింది. ఇప్పటివరకు ఈ మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ను ఈడీ ఐదుసార్లు ప్రశ్నించింది.

అయితే ఈ కేసులో తాను నిర్దోషినని, చంద్రశేఖర్ ఆరోపించినట్లుగా తనకు మనీలాండరింగ్, బెదిరింపుల గురించి తెలియదని ప్రతిసారి చెబుతుంది జాక్వెలిన్. అయితే ఈ కేసులో జాక్వెలిన్ సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తపడుతుందని.. చంద్రశేఖర్ అరెస్ట్ తర్వాత ఫెర్నాండెజ్ తన మొబైల్ నుంచి మొత్తం డేటాను డెలిట్ చేసిందని.. ఆ తర్వాత సాక్ష్యాలన్నింటిని తారుమారు చేసిందని.. సాక్ష్యాలను నాశనం చేయాలని ఆమె తన సహోద్యోగులను కూడా కోరిందని ఈడీ ఆరోపించింది. చంద్రశేఖర్ డబ్బును జాక్వెలిన్ ఉపయోగించిందని ఈడీ పేర్కొంది.