మాములుగా ఒక యూత్ హీరోకి వరసగా రెండు ఫ్లాపులు వస్తే చాలు కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. పైగా ఓటిటిలు కూడా హక్కులు కొనుగోలు చేసే విషయంలో కొత్త ఎత్తుగడలు వేస్తుండటంతో ఏ మాత్రం వర్కౌట్ కాని సినిమాలు పడితే మాత్రం మార్కెట్ రిస్క్ లోకి వెళ్తోంది. కానీ సంతోష్ శోభన్ ఈ విషయంలో అదృష్టవంతుడని చెప్పాలి. రూపం, ప్రతిభ రెండూ ఉన్నా బ్లాక్ బస్టర్ కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ మంచి బ్యానర్ల అండలో అవకాశాలు వస్తుండటంతో బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా కపుల్ ఫ్రెండ్లీని అనౌన్స్ చేశారు.

యువి సంస్థ బ్యాకప్ కావడంతో బడ్జెట్, మార్కెటింగ్ పరంగా ఎలాంటి రిస్క్ ఉండదు. సంతోష్ శోభన్ తండ్రి శోభన్ ప్రభాస్ కు వర్షం రూపంలో ఒక గొప్ప మైలురాయి అందించాడు. అప్పటి నుంచే ఈ కుటుంబంతో డార్లింగ్ కు మంచి అనుబంధం ఉంది. ఆ కారణంగానే యువి గతంలో నిర్మించిన కళ్యాణం కమనీయం ఆశించిన ఫలితాన్ని అందివ్వకపోయినా అంతకు ముందు ఏక్ మినీ కథతో డీసెంట్ సక్సెస్ ఇచ్చారు. మారుతీ లాంటి అగ్ర దర్శకుడు మంచి రోజులు వచ్చాయి చేస్తే స్వప్న సినిమా బ్యానర్ లో అన్నీ మంచి శకునములే, సుష్మిత కొణిదెల సంస్థలో శ్రీదేవి శోభన్ బాబు చేశాడు.

గత ఏడాది ప్రేమ్ కుమార్ సైతం లెక్క తప్పిన బాపతే. అయినా పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నాలు చేస్తున్న సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ కీలకం కానుంది. ఇవాళ చిన్న కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. మిస్ ఇండియా మానసి వారణాసి దీంతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. టైటిల్ నుంచే విభిన్నంగా అనిపిస్తున్న ఈ ఎంటర్ టైనర్ ఒక జంట చుట్టూ తిరుగుతుందని పేరులోనే క్లూస్ ఇచ్చారు కాబట్టి యూత్ ని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఎక్కువ కొత్త టీమే పనిచేస్తోంది.