
మలయాళ హీరో ఉన్ని ముకుందన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయనపై అతడి మేనేజర్ విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొచ్చి నగరంలోని ఓ అపార్ట్మెంట్ వద్ద ఉన్ని ముకుందన్ తనపై దాడికి పాల్పడ్డారని, గత కొంతకాలంగా వేధింపులకు గురవుతున్నానని విపిన్ ఆరోపించారు. టోవినో థామస్ నటించిన ‘నరివെട്ട’ చిత్రాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే ఉన్ని తనపై అగ్రెసివ్గా ప్రవర్తించాడని చెప్పారు.
ఫిర్యాదులో విపిన్ మాట్లాడుతూ – “నిన్న ఉదయం అతడు తన అపార్ట్మెంట్కు పిలిచి, కారు పార్కింగ్ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశాడు. ఈ మధ్య అతడికి ఆఫర్స్ తగ్గడంతో మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. పైగా నేను మరో హీరో సినిమాను పొగిడినందుకే నా మీద కోపం చూపించాడు,” అని తెలిపారు. దీనిపై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విపిన్ వివరించిన ప్రకారం, ఆయన 6 ఏళ్లుగా ఉన్ని ముకుందన్కి మేనేజర్గా పని చేస్తున్నారు. “నాకు 18 ఏళ్ల అనుభవం ఉంది. ఎన్నో చిత్రాలకు పని చేశాను. కానీ ఇలాంటి అనుభవం ఎప్పుడూ రాలేదు. ఉన్ని తన సిబ్బందిపై అహంకారంతో ప్రవర్తిస్తాడు,” అని ఆరోపించారు.
గతంలో కూడా ఉన్ని ముకుందన్ వివాదాల్లో తలకెత్తిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలు, యూట్యూబర్ను బెదిరించిన కేసులు వంటి వాటిలో ఆయన పేరు వచ్చిన సంగతి మరచిపోలేం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దాడి కేసు మరింత చర్చకు దారితీసేలా ఉంది.