Published on: 5:50 am, 15 July 2024

మాములుగా ఒకే తరహా పాత్రలతో హీరోలు పోటీ పడటం చాలాసార్లు చూశాం. కానీ హీరోయిన్ల మధ్య ఇలాంటివి తక్కువగా జరుగుతాయి. అలాంటిదే ఇది. 2020లో నయనతార టైటిల్ పోషించిన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. ఆర్జె బాలాజీ దర్శకత్వం వహించగా అప్పుడున్న కరోనా పరిస్థితుల వల్ల డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయ్యింది. దొంగ స్వామిగా అజయ్ ఘోష్ విలనీ బాగా పండింది. డిజిటల్ రిలీజ్ అయినప్పటికీ మంచి స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్ తీయాలని అప్పటి నుంచి నిర్మాణ సంస్థ, దర్శకుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కుదరలేదు.

కట్ చేస్తే ఇప్పుడు అమ్మోరు తల్లి 2ని అదే ప్రొడక్షన్ హౌస్ అదే నయనతారతో తీసేందుకు రెడీ అవుతోంది. విచిత్రం ఏంటంటే దర్శకుడు మారుతున్నాడు. పేరు వెల్లడి చేయలేదు. అటుపక్క ఆర్జె బాలాజీ మాసాని అమ్మన్ అని కొత్త పేరు పెట్టుకుని వేరే సబ్జెక్టుతో త్రిషతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. రెండూ ఒకేసారి పోటాపోటీగా నిర్మాణం జరిగబోతున్నాయి. నయన్, త్రిషలు ప్రస్తుతం మాములు డిమాండ్ లో లేరన్న సంగతి విదితమే. రెమ్యునరేషన్లు భారీగా తీసుకుంటున్నారు. అలాంటిది ఇద్దరూ అమ్మోరు తల్లులుగా కనిపించడం అభిమానులకు కనువిందే.

ఇవి ఇతర భాషల్లో వస్తాయి కాబట్టి మన ఆడియన్స్ లోనూ ఆసక్తి ఉంటుంది. వద్దన్నా ఎలాగూ పోలికలు వస్తాయి. ఎవరు బాగా చేశారు ఎవరి సినిమా బాగుందనే కోణంలో రకరకాల విశ్లేషణలు జరుగుతాయి. మరి ఈ వెరైటీ క్లాష్ ఎవరు నెగ్గుతారో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి. నయనతార ప్రస్తుతం అయిదారు సినిమాలతో బిజీగా ఉంది. త్రిష ఇటు చిరంజీవి విశ్వంభరతో పాటు అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ చిత్రాల్లో సమాంతరంగా నటిస్తోంది. ఇలా కాదు కానీ వీళ్ళు ఒకే మూవీలో అమ్మోరులుగా విశ్వరూపం చూపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరిక. కానీ అది సాధ్యం కాదు లెండి.