ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్టులో విలన్ పాత్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఫహాద్ కనిపించింది కొద్ది సమయమే అయినా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2 చిత్రంలో ఫహద్ ఫాజిల్ రోల్ ప్రధానంగా ఉండబోతుంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఫహాద్ చిక్కు్ల్లో పడినట్లు తెలుస్తోంది. అతడి పై కేరళ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు అతడిపై సుమోటోగా కేసు కూడా నమోదయ్యింది.

అసలు విషయానికి వస్తే ఫహాద్ ఫాజిల్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవలే ఆవేశం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవైపు హీరోగా, విలన్ గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఫహాద్.. ఇప్పుడు నిర్మాతగానూ మారాడు. ప్రస్తుతం పింకేలీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్రీకరించారు. గురువారం రాత్రంతా షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ రూంలోనూ షూటింగ్ చేయడంతోపాటు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. దీంతో అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా పర్మిషన్ ఇచ్చారని ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి సీరియస్ అయ్యారు. ఈ విషయంపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

ఒకవైపు రోగులకు చికిత్స జరుగుతుండగా.. మరోవైపు షూటింగ్ జరిగిందని.. దీంతో రోగులు.. వారితోపాటు ఉన్న కుటుంబసభ్యులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసర చికిత్స అవసరం ఉన్నప్పటికీ పలువురు రోగులను ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లనీయకుండా చిత్రయూనిట్ అడ్డుకున్నారని.. ఆసుపత్రిలో రాత్రంతా నానా హంగామా చేశారని అక్కడున్న రోగులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించింది నిర్మాతల సంఘం. ఆసుపత్రిలో షూటింగ్ కోసం రూ.10 వేలు చెల్లించామని తెలిపింది. అయితే ఈ ఘటనపై కేరళ మానవ హక్కుల సంఘం నిర్మాత ఫహాద్ ఫాజిల్ పై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఫహాద్ స్పందించలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.