రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. తాజగా టాలీవుడ్ యాక్టర్ నాగశౌర్య దర్శన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. దర్శన్ మంచివాడు.. ఇలాంటి పని చేయడంటూ నాగశౌర్య చేసిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. దర్శన్పై వస్తున్న ఆరోపణల్లో నిజాలు తెలియకుండా అతడిపై విమర్శలు చేయడం, ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదనిపిస్తుందన్నారు శౌర్య. దర్శన్ నిర్దోషిగా బయటకు వస్తాడనే నమ్మకం తనకు ఉందన్నారు. నిజమైన దోషులు చట్టం ముందుకు తప్పకుండా వస్తారంటూ అంటూ ఇన్స్టా పోస్ట్లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట కలకలం రేపుతోంది. రేణుకాస్వామి మర్డర్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న దర్శన్ గత ఇరవై రోజులుగా జైలులోనే ఉన్నారు. దర్శన్ను కఠినంగా శిక్షించాలంటూ కొందరు డిమాండ్ చేస్తుండగా..మరి కొంతమంది సాండల్వుడ్ సినీ ప్రముఖులు మాత్రం దర్శన్కు సపోర్ట్గా నిలుస్తోన్నారు. తాజాగా టాలీవుడ్ హీరో నాగశౌర్య కూడా దర్శన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం సెన్సేషన్ క్రియేట్ చేసింది.
రీల్ హీరో..రియల్ విలన్… చాలెంజింగ్ స్టార్ దర్శన్ అసలు ముసుగు తొలుగుతోంది. తన మేలు కోరిన అభిమానినే బలితీసుకున్న స్టారాధిస్టారుడు ఊచలు లెక్కిస్తున్నాడు. తనప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్లు పంపాడనే కక్షతో రేణుకస్వామి అనే అభిమానికి కిడ్నాప్ చేయించి.. చిత్రహింసలు పెట్టి చంపేశారు దర్శన్ అండ్ గ్యాంగ్. రేణుకా స్వామి డెడ్బాడీ ఫోటోలు చూసిన కొందరు.. ఒక మనిషి ఇంత దారుణంగా చంపొచ్చా అంటూ నివ్వెరపోయారు. హత్య తర్వాత సినీఫక్కీలో ఈ కేసు నుంచి ఎస్కేప్ కావచ్చని మాస్టారే ప్లానే వేశారు. కానీ కథ అడ్డం తిరిగింది. పోలీసుల విచారణలో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. రేణుకస్వామిని చంపేశాక డెడ్బాడీని తరలించడం సహా ఆ నేరాన్ని తమపై వేసుకున్న నలుగురికి దర్శన్ 30 లక్షల రూపాయిలు ఇచ్చాడు. స్వయంగా దర్శనే విచారణలో ఈ నిజాన్ని చెప్పాడన్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో తన పేరు బయటకు రాకుండా చూడాలని వాళ్లను కోరినట్టు వాంగ్మూలం ఇచ్చాడు దర్శన్.
రేణుకస్వామిని చిత్ర దుర్గంలో కిడ్నాప్ చేసి బెంగళూరులోని ఓ షెడ్కు తరలించారు. ఆ క్రమంలోనే అతనిపై దాడి చేశారు. షెడ్లోకి వచ్చాక కాళ్లు చేతులు కట్టిపడేశారు. దర్శన్, పవిత్ర అక్కడి చేరుకోవడం.. వస్తూ వస్తూనే పవిత్ర రేణుక స్వామి కాళ్లతో తన్నడం మొదలెట్టిందట. తెరపైన విలన్లను చితక్కొట్టే హీరో సారు.. బక్కపల్చని రేణుకస్వామిపై విలన్లా దాడి చేశాడు. కర్రలతో బెల్టుతో కొట్టడమే కాదు ..కరెంట్ షాక్ ఇస్తూ చిత్రహింసలకు గురి చేశారని విచారణలో తేలింది. దాడికి వాటన్నింటినీ సీజ్ చేశారు పోలీసులు. అలాగే రేణుకస్వామిని చంపేశాక.. ఆ రోజు తాము ధరించిన డ్రెస్లను, షూస్ను దాచేశారు దర్శన్, పవిత్ర. వాటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఇన్ని ఆధారాలు బయటపడుతున్నాయ్.. దర్శన్ హిస్టరీ కూడా ప్రపంచానికి తెలుసు.. ఛాలెంజింగ్ స్టార్గా ఎదిగిన దర్శన్ ఆది నుంచే కాంట్రావర్షియల్కు కేరాఫ్గా తన మార్క్ చాటుకున్నారు. భార్య విజయలక్ష్మితో గొడవ పడి దాడి చేసిన ఘటనలో గృహహింస కేసులో 14 రోజుల జైలుకెళ్లాడు. ఆ తరువాత రాజీమంత్రంతో వివాదం సద్దుమణిగింది. రాష్ డ్రైవింగ్ కేసులోనూ రాజీ మంత్రంతో గట్టెక్కాడు. ఓ హోటల్ను వెయిటర్పై దాడి చేయడమే కాకుండా ఆ విషయం బయటకు పొక్కకుండా సీసీ టీవీ విజువల్స్ మాయం చేశాడనే వివాదం చెలరేగింది. ఇలా అతని చుట్టూ ఎన్నో వివాదాలు, ఫిర్యాదులు ఉన్నాయి. అసలు అంత పెద్ద హీరోని ఎలాంటి ఆధారాలు లేకుండా ఇన్ని రోజులు జైల్లో ఉంచుతారా..?. అలాంటి దర్శన్కు మద్దతుగా.. కరుణకు పేరుగాంచిన మనిషిగా పేర్కొంటూ టాలీవుడ్ హీరో నాగశౌర్య పోస్ట్ పెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.