• ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు చరణ్‌
  • చరణ్‌తో మెల్‌బోర్న్‌ మేయర్‌ నిక్‌ రీస్‌ సెల్ఫీ
  • ఆరెంజ్‌ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను

Ram Charan Selfie With Melbourne Mayor Nick Reece: ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’కు టాలీవుడ్‌ స్టార్‌ హీరో, గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ హాజరైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో భారత జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మెల్‌బోర్న్‌లో అభిమానులతో కలిసి చరణ్‌ సెల్ఫీలు దిగారు. చరణ్‌తో మెల్‌బోర్న్‌ మేయర్‌ నిక్‌ రీస్‌ సెల్ఫీ తీసుకున్నారు. దీనిపై నిక్‌ రీస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

తాను రామ్‌ చరణ్‌కు పెద్ద అభిమానిని అని మెల్‌బోర్న్‌ మేయర్‌ నిక్‌ రీస్‌ తెలిపారు. ‘మెల్‌బోర్న్‌ నగరాన్ని గొప్పగా మార్చడంలో ఇక్కడ ఉంటున్న భారతీయులది పెద్ద పాత్ర. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి రోషెనాతో కలిసి నేను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వెళ్లాను. రామ్‌ చరణ్‌తో సెల్ఫీ తీసుకున్నా. నా కోరికల లిస్ట్‌లలో ఇది ఒకటి. అక్టోబర్‌లో డిప్యూటీ మేయర్‌గా రోషెనా ఎన్నికైతే చరిత్ర సృస్టిస్తారు. 182 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పదవిని పొందిన భారతీయ వారసత్వపు మొదటి వ్యక్తి రోషెనా అవుతారు. ఆమెతో కలిసి ఈ ఈవెంట్‌కు వెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని నిక్‌ రీస్‌ పేర్కొన్నారు.

Also Read: P Susheela: క్షేమంగా ఇంటికి చేరుకున్నా.. మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి: పి.సుశీల

మెల్‌బోర్న్‌ ప్రాంతం అంటే తనకు చాలా ఇష్టం అని గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ చెప్పారు. ‘మెల్‌బోర్న్‌ ప్రాంతమంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ షూటింగ్‌ చేసిన ఆరెంజ్‌ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. భారతీయ చిత్రపరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది’ అని చరణ్‌ చెప్పుకొచ్చారు. చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్‌’ వచ్చే నెలలో రిలీజ్ కానుంది.