• మలయాళ చిత్ర పరిశ్రమలో కుదుపు
  • హేమ కమిటీ రిపోర్టులో షాకింగ్‌ విషయాలు
  • మోహన్‌లాల్‌ కీలక నిర్ణయం

Actress Parvathy on Mohanlal: మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి ‘జస్టిస్‌ హేమ కమిటీ’ ఓ నివేదిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే. హేమ కమిటీ రూపొందించిన రిపోర్టులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు.. నటీమణులను ఓ ఆటబొమ్మలా చూస్తారని పేర్కొంది. హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం చాలా మంది నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం భారతీయ సినిమా మొత్తం దీని గురించే మాట్లాడుకుంటుంది.

హేమ కమిటీ నివేదిక తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు, మెగాస్టార్ మోహన్‌లాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మ) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఈ మూకుమ్మడి రాజీనామాల నిర్ణయంపై హీరోయిన్ పార్వతి స్పందించారు. ఈ విషయాన్ని మీడియాకు వివరించే స్థితిలో ఉన్న మోహన్‌లాల్ వైదొలగడం ఎంత పిరికితనం అని విమర్శించారు. అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం పిరికిపంద చర్య అని పేర్కొన్నారు.

Also Read: UPI Circle Gpay: గూగుల్‌ పేలో ‘యూపీఐ సర్కిల్‌’ ఫీచర్‌.. ఇకపై అకౌంట్‌ను మరొకరు కూడా వాడొచ్చు!

ఓ ఇంటర్వ్యూలో పార్వతి మాట్లాడుతూ… ‘ఈ వార్త వినగానే నేను ముందుగా షాక్ అయ్యా. ఇది ఎంత పిరికితనం. విషయాన్ని మీడియాకు వివరించే స్థితిలో ఉన్న వాళ్లు తమ బాధ్యతల నుంచి వైదొలగడం పిరికితనమే. రాజీనామా చేయకుండా ప్రభుత్వంతో కలిసి పని చేస్తే అద్భుతంగా ఉండేది. నేను గతంలో అమ్మలో భాగమే. వారు ఎలా పని చేస్తారో నేను చూశాను. నేను అసోసియేషన్‌కు రాజీనామా చేయడానికి ఒక కారణం ఉంది. మహిళల అవసరాల గురించి మాట్లాడే హక్కు నటీమణులకు లేదు. సమాజంకు ఇపుడు అంతా తెలిసింది. ఈ పరిస్థితి మారాలంటే మెరుగైన నాయకత్వం అవసరం. రాబోయే రోజుల్లో అయినా ప్రతి ఒక్కరూ మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది’ అని అన్నారు.