అక్రమ కట్టడాలతో దూకుడు మీద ఉన్న హైడ్రాకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి షాక్ ఇచ్చారు. GHMCలో జీతం తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తోన్న అధికారులపై ఆమె సీరియస్ అయ్యారు. ముఖ్యంగా విజిలెన్స్ విభాగం అధికారులు హైడ్రాను వీడటం లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హైడ్రా కమిషనర్‌కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తమ పరిధిలో పనిచేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దని ఆమె ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రోజువారీ కార్యక్రమాలు, విచారణల్లో విజిలెన్స్ అధికారుల అవసరం ఉంటుందని స్థాయీ సంఘం సభ్యులు చెబుతున్నారు.

కానీ వారంతా ఆ బాధ్యతలు నిర్వర్తించడం లేదని అంటున్నారు. ఈ మేరకు సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో అక్రమ కట్టాలను కూల్చేస్తున్న హైడ్రాను మరింత బలంగా చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హైడ్రా యాక్షన్స్‌కు ఏం సమస్యలూ రాకుండా పోలీసు బలాన్ని అందిస్తోంది ప్రభుత్వం. దీని కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

ఇందులో భాగంగా..15 మంది ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు…ఆరుగురు ఎస్‌ఐలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు లా అండ్‌ ఆర్డర్‌ డీజీ మహేష్‌ భగవత్‌. ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారిని ఇక్కడకు రప్పించి..హైడ్రాకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రానున్న రోజుల్లో హైడ్రాకు పోలీస్‌ స్టేషన్ ను కూడా కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హైడ్రా పరిధిని జీహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండీఏ వరకు విస్తరించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

The post జీహెచ్ఎంసీ Vs హైడ్రా.. వారికి ఆమ్రాపాలి వార్నింగ్! appeared first on Rtvlive.com.