తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతి పండగ అంటేనే పెద్ద సినిమాల జాతర, ముఖ్యంగా ‘విక్టరీ’ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలే వేరు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోకు నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ తోడైతే? అవును.. ఊహించని రీతిలో టాలీవుడ్లో ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్ – అనిల్ రావిపూడిల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘F2’, ‘F3’ వంటి హిట్లతో ఫ్యామిలీ ఆడియన్స్ను ఉర్రూతలూగించిన వీరిద్దరూ, ఇప్పుడు ఐదోసారి జతకడుతున్నారు. ఇటివలే ‘MSG’లో అతిధి పాత్రతో మెరిసిన వెంకటేష్, పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు, ‘పటాస్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న రెండో చిత్రం ఇది. ఈ ఇద్దరు స్టార్ హీరోల కలయిక సినిమాపై అప్పుడే భారీ హైప్ను క్రియేట్ చేస్తోంది.
Additionally Learn:Telangana: ఇంధన నిల్వలు తెలంగాణ సర్కార్ కీలక అప్డేట్..
‘భగవంత్ కేసరి’, MSG’లో వంటి మాస్ బ్లాక్బస్టర్ను అందించిన ‘షైన్ స్క్రీన్స్’ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడితో ఈ సంస్థకు ఇది వరుసగా మూడో సినిమా కావడం గమనార్హం. ఈ భారీ ప్రాజెక్ట్కు సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీమతి అర్చన సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘జీ స్టూడియోస్’ సహ-నిర్మాతగా చేతులు కలిపింది. ఇంతటి భారీ నిర్మాతలు వెనకుండటంతో, టెక్నికల్ పరంగా కూడా సినిమా టాప్ నాచ్గా ఉండబోతోంది. అనిల్ రావిపూడి మార్కు హాస్యం, కుటుంబ అనుబంధాలు, పండగ వాతావరణం మేళవింపుతో ఈ కథ ఉండబోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా క్లీన్ ఎంటర్టైనర్గా స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్ పూజా కార్యక్రమంతో సినిమాను ప్రారంభించి, టైటిల్తో పాటు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. నందమూరి – దగ్గుబాటి హీరోల ఈ సెన్సేషనల్ కాంబో, 2027 సంక్రాంతి రేసులో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
