
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రస్తుతం శరవేగంగా నిర్మాణంలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించి కీలకమైన డేటా హార్డ్ డ్రైవ్ మాయమవడం కలకలం రేపుతోంది. ముంబైకి చెందిన హెచ్ఐవీ స్టూడియోస్ వారు పంపిన హార్డ్ డ్రైవ్ ఫిల్మ్ నగర్లోని ట్వెంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కార్యాలయానికి డీటీడీసీ ద్వారా పంపినట్లు తెలుస్తోంది. మే 25న ఆ పార్సిల్ డెలివరీ అయినా, ఆ తర్వాత డ్రైవ్ అదృశ్యమైందట.
ఆఫీస్ బాయ్ రఘు ఆ హార్డ్ డ్రైవ్ను చరిత అనే యువతికి అప్పగించిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందని సమాచారం. చరితపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆమె సినీ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే డ్రైవ్ తీసుకెళ్లిందని ట్వెంటీ ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రెడ్డి విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హార్డ్ డ్రైవ్లో ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన గోప్యమైన, విడుదల కాని, సున్నితమైన వీడియో కంటెంట్ ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ డేటా లీక్ అయితే లేదా డిలీట్ అయినా సినిమాకు తీరని ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు.
ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. త్వరలోనే హార్డ్ డ్రైవ్ను ట్రేస్ చేసి తిరిగి రికవరీ చేస్తామనే నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. కన్నప్ప సినిమా అభిమానుల్లో ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.