
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న థగ్ లైఫ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో శింబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రమోషన్ల దశలో ఉన్న ఈ సినిమా తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుంది. చెన్నైలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కమల్ చేసిన వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ ఈవెంట్లో, కమల్ హాసన్ మాట్లాడుతూ – “కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది” అనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ మాటలను కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ను ఉద్దేశించి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో భాషా గౌరవాన్ని తక్కువ చేస్తాయంటూ తీవ్ర విమర్శలకు దారితీశాయి. కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు, అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
బెంగుళూరులో థగ్ లైఫ్ సినిమా పోస్టర్లను చించివేయడం, కమల్ హాసన్ దిష్టి బొమ్మలను దహనం చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, KFCC (Karnataka Film Chamber of Commerce) కమల్ హాసన్ మే 30, 2025లోగా క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో సినిమా విడుదలను నిషేధిస్తామని హెచ్చరించింది.
కానీ కమల్ హాసన్ మాత్రం – “నేను తప్పు చేయలేదు, క్షమాపణ చెప్పనక్కరలేదు. కర్ణాటకలో సినిమాను విడుదల చేయడం లేదన్నా పర్వాలేదు” అంటూ స్పష్టంగా చెప్పేశారు. ప్రస్తుతం ఈ వివాదం కర్ణాటక హైకోర్టులోకి వెళ్లింది. హైకోర్టు కూడా కమల్ను ప్రశ్నిస్తూ, “మీరు చరిత్రకారులా? తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఎలా అంటారు?” అని నిలదీసింది. దీనితో వివాదం ఇంకా ముదిరింది.
ఇక థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో విడుదల కావాలంటే కమల్ క్షమాపణ చెప్పాల్సిందేనన్నది పరిస్థితి. ఇది సినిమా భవితవ్యం ఏవిధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాల్సిందే.