మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా, ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కుర్ర హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరోయిన్గా త్రిష నటిస్తోంది. సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘విశ్వంభర’తో పాటు బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు చిరంజీవి. త్వరలోనే ఈ మెగా మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వీటి తర్వాత బాబీ తో మెగాస్టార్ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చునని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. సుమారు రూ. 6-10 లక్షల పైగా విలువ చేసే ఒమేగా సీమాస్టర్ వాచ్ను బాబీకి బహుమతిగా అందించారు చిరంజీవి. ఈ విషయాన్ని డైరెక్టరే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
“చిరంజీవి గారి నుంచి నాకు మెగా సర్ప్రైజ్ వచ్చింది. ఈ బహుమతికి నేను అస్సలు వెలకట్టలేను. థాంక్యూ అన్నయ్యా! ఈ స్పెషల్ గిఫ్ట్ను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అని చిరంజీవి పై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు బాబీ. ఈ సందర్భంగా తన చేతికి మెగాస్టార్ ఖరీదైన వాచ్ తొడుగుతోన్న ఫోటోలను కూడా షేర్ చేశాడు డైరెక్టర్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక అది చూసిన వారంతా “మెగాస్టార్కు ఒకసారి నచ్చితే చాలు.. జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు”, “వాచ్ అదిరిపోయింది” అని క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.