Thu. Mar 26th, 2026
Sadia Imam: పెట్రోల్ ధరలపై ఆగ్రహం.. పాక్‌ నేతలపై నటి సంచలన వ్యాఖ్యలు

Sadia Imam: పాకిస్థాన్లో పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి, టీవీ హోస్ట్ సాదియా ఇమామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.300కు చేరడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన సాదియా, దేశ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “మీరు అందరూ చచ్చిపోతే పోయేదేముంది? కొత్తవాళ్లు వస్తారు, కొత్త ఆలోచనలు వస్తాయి” అంటూ ఆమె తీవ్రంగా మండిపడ్డారు.

Learn Additionally: Strait of Hormuz: హర్మూజ్‌లో ఎక్కడికక్కడే నిలిచిపోయిన వందలాది షిప్స్.. ఏరియల్ ఫోటోలు వైరల్

పెట్రోల్ ధరలను అనవసరంగా పెంచుతున్నారని ఆరోపించిన సాదియా ఇమామ్‌.. “పాత స్టాక్ ఉన్నప్పటికీ కొత్త ధరలు ఎలా నిర్ణయిస్తారు?” అంటూ ప్రశ్నించారు. ఇతర దేశాలతో పోలిస్తే పాకిస్థాన్‌లో ధరలు ఎక్కువగా పెరగడం పై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశం, బంగ్లాదేశ్ వంటి దేశాల ఉదాహరణలు చూపిస్తూ, అక్కడ పరిస్థితి ఇంత తీవ్రంగా లేదని పేర్కొన్నారు. అలాగే ఇరాన్ నుంచి చౌకగా పెట్రోల్ పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం దానిని వినియోగించుకోకపోవడంపై కూడా ఆమె ప్రశ్నించారు. ఐఎంఎఫ్ అప్పుల కారణంగా దేశం ఆర్థిక ఒత్తిడిలో ఉందని విమర్శించారు.

ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టో జర్దారీ, అలాగే ఇతర నాయకులను ఉద్దేశించి సాదియా ఘాటుగా స్పందించారు. “మీరు ఎక్కడున్నారు? ప్రజల సమస్యలు మీకు కనిపించడం లేదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సాదియా వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. చాలా మంది ఆమె అభిప్రాయాలను సమర్థిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.