
కోలీవుడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ఎస్ జే సూర్య ఇప్పుడు విలన్ పాత్రలతో టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు పొందుతున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో సూర్య విలన్ పాత్రతో దూసుకుపోయాడు. అంతేకాకుండా నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రంలో అతడు అవినీతిపరుడైన పోలీస్ అధికారి దయా పాత్ర ద్వారా ప్రేక్షకులను భయపెట్టాడు. ఈ పాత్రకు విమర్శకుల మంచి ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు లో ఉత్తమ సహాయ నటుడిగా ఎస్ జే సూర్యను ఎంపిక చేసింది.
హీరో నేచురల్ స్టార్ నాని ఈ ఘనతకు సోషల్ మీడియాలో సూర్యకు అభినందనలు తెలియజేశాడు. “మీరు కేవలం సహాయ నటుడే కాకుండా, అన్ని విధాలా ఈ అవార్డుకు అర్హులన్నారు” అని గొప్ప ప్రశంసలు కురిపించాడు. అయితే అప్పటికే షూటింగ్ పనుల్లో ఉన్న సూర్య కేవలం ‘థ్యాంక్స్ సర్’ అని చిన్నగా స్పందించాడు. ఈ తటస్థ స్పందనకు సంబంధించిన విషయం గ్రహించి, సూర్య శనివారం ఓ క్షమాపణ నోట్ను నానికి ట్వీట్ ద్వారా పంపాడు.
సూర్య తన ట్వీట్ లో, “షూటింగ్ మధ్యలో ఉండటంతో మీ అభినందనలకు సరైన స్పందన ఇవ్వలేకపోయాను. మీరు, దర్శకుడు వివేక్ గారు లేకపోతే ఈ ప్రయాణం సాధ్యం కాకపోయేది. మీకు, మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని రాసుకొచ్చాడు. ఈ క్షమాపణ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎలాంటి మొహమాటం లేకుండా స్పందించిన సూర్యకు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.